నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన జగన్
ABN , First Publish Date - 2022-05-21T06:41:14+05:30 IST
అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి, తీరా వచ్చాకజగన్రెడ్డి నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు.
2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం యువత కృషిచేయాలి
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల పిలుపు
ఒంగోలులో జోన్-4 తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం
ఒంగోలు (కార్పొరేషన్), మే 20: అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి, తీరా వచ్చాకజగన్రెడ్డి నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు. జోన్-4 (తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, రాజంపేట) తెలుగు యువత ఆధ్వర్యంలో ‘జాబ్ ఎక్కడ? జగన్రెడ్డి’ అనే అంశంపై విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ఒంగోలులో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనార్దన్ మాట్లాడుతూ టీడీపీకి యువత వెన్నెముకలాంటిదన్నారు. రాష్ట్ర భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, ప్రతి కార్యకర్త సమష్టి కృషితో పనిచేసి 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబునాయుడును సీఎంని చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చినబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలలో జగన్ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారన్నారు. నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్పై సీఎంను నిలదీయాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి యువత నడుం బిగించాలన్నారు. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రకటనలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై యువత పోరాటాలు సాగించాలన్నారు. మహానాడును విజయవంతం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన కోరారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు, దర్శి ఇన్చార్జి పమిడి రమేష్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు తెలుగు యువత ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.