జగనయ్యా.. బతికేవుండా సామీ!

ABN , First Publish Date - 2021-09-30T06:34:33+05:30 IST

బతికేవుండా సామీ అంటూ వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ మహేశ్వరపురానికి చెందిన టి.చిన్నక్క వాపోయింది.

జగనయ్యా.. బతికేవుండా సామీ!
మహేశ్వరపురానికి చెందిన టి.చిన్నక్క

‘‘నాయనా.. జగనయ్యా.. నేను బతికే ఉండాను సామీ..! కట్టె మాదిరిగా తిరగతానే ఉండాను. ‘ముసిల్దానా.. ఇంక చాలుగానీ వొచ్చెయ్యి..’ అని ఆ బగమంతుడు ఇంకా పిలవనంపీలేదయ్యా.. ఈ ఆపీసర్లు మాత్రం ‘నువ్వెప్పుడో సచ్చిపొయినావు పో’ అంటాఉండారయ్యా. పదినెల్లుగా రేసిను బియ్యం ఆపేసినారు సామీ.. ఇదేం అన్నేయం దేవరా అనడిగితే, ‘సచ్చిపొయినోళ్లకి రేసిను ఇయ్యరు’ అంటావుండారు. నేను దెయ్యంగాదు మనిసినే, మీరు రేసినియ్యకపోతే నిజింగానే ఆకిలికి సచ్చిపోతాను సాముల్లారా అని నెత్తీనోరూ బాదుకుంటే పించినీ మాత్రం ఎట్నో ఇస్తానే ఉండారు. ఇంకమింద అదిగూడా ఇయ్యరంట. ముసిల్దాన్ని యాడకని తిరిగేది? ఎవురి కాళ్లూ గెడ్డాలు పట్టుకునేది? బతికుండే నన్ను  సంపేసినట్టు కాయితాలకి ఎక్కించేసిన వాళ్ళెవురో, వాళ్ళ కతేందో చూడు నాయనా.. ఆ కటీనాత్ముల్ని జెమినీలో పెట్టెయ్యి తండ్రీ!’’

   వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ మహేశ్వరపురానికి చెందిన టి.చిన్నక్క కడుపుదుఃఖం ఇది. ఆమె వయసు 90 పైనే ఉంటుంది. రికార్డుల్లో మాత్రం 75గా నమోదైంది. పదేళ్ల కిందట భర్త చచ్చిపోయాడు. ఒంటరి బతుకు. ప్రభుత్వం ఇచ్చే పింఛనుతో, రేషను (కార్డు నెంబరు డబ్ల్యుఏపీ 104300300028) బియ్యంతో బతుకు లాగిస్తోంది.  పది నెలలుగా రేషను ఇవ్వడం లేదు. కారణం చినక్క చచ్చిపోయినట్లు రికార్డుల్లో ఉంది. అధికారుల దగ్గరకు వెళ్లి లబోదిబోమనడంతో చచ్చిపోయిందన్న చినక్కకు మానవత్వంతో నెలనెలా పింఛను(పెన్షన్‌ ఐడీ నెంబరు-736000) మాత్రం ఇస్తున్నారు.చచ్చిపొయిన వాళ్లకు పింఛను ఇవ్వడం కుదరదని, పైకి తెలిస్తే ఉద్యోగాలు పోతాయని ఇప్పుడు సిబ్బంది కూడా భయపడుతున్నారు. దీంతో వచ్చే నెల నుంచీ పింఛను రాదని తేల్చి చెప్పేశారు.ఇంక బతికేదెట్రా బగమంతుడా అని చినక్క కన్నీళ్ళు పెట్టుకుంటోంది. 

- వెదురుకుప్పం


మానవత్వంతోనే పెన్షన్‌ డబ్బులిచ్చారు

రికార్డుపరంగా చిన్నక్క చనిపోయినట్లు పొరబాటున పదినెలల క్రితం సచివాలయంలో నమోదైన మాట నిజమే.కానీ, ఆ వృద్ధురాలు బతికే ఉందన్న మానవతా దృకథంతో పది నెలలుగా పెన్షన్‌ డబ్బులు ఇచ్చారు. ప్రస్తుతం వెరిఫికేషన్‌ ఉన్న కారణంగా నిలిపివేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఆమె బతికే ఉందని రెక్టిపై చేసుకోవాలి. తర్వాత పెన్షన్‌ వస్తుంది. 

- సుధాకరరావు, ఎంపీడీవో, వెదురుకుప్పం

Updated Date - 2021-09-30T06:34:33+05:30 IST