నా పంచాయితీ రేవంత్రెడ్డితోనే: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-03-22T18:10:22+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానన్నారు. కాంగ్రెస్లోనే తప్పొప్పులు మాట్లాడేకునే వీలుంటుందని, పదవులు కోత అనేది స్పోర్టివ్గా తీసుకుంటానన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దేశానికి కాంగ్రెస్తోనే మేలు జరుగుతుందన్నారు. అయితే తన పంచాయితీ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, మెదక్ పర్యటనకు రేవంత్ తనను పిలవలేదని చెప్పారు.
రేవంత్రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడతానన్నారు. తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు.