Chowkidaarకి అర్థం తెలిసింది: కైలాష్ వ్యాఖ్యలపై Jairam సెటైర్

ABN , First Publish Date - 2022-06-20T02:29:09+05:30 IST

అగ్నివీరులు మిలటరీలో నాలుగేళ్లు శిక్షణ పొంది సర్వీసు నుంచి బయటకు వచ్చేటప్పుడు రూ.11 లక్షలు పొందుతారు. అగ్నివీర్ బాడ్జి కూడా ఉంటుంది. బీజేపీ కార్యాలయానికి సెక్యూరీటీ కోసం ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే అగ్నివీరులకు నేను ప్రాధాన్యం ఇస్తాను..

Chowkidaarకి అర్థం తెలిసింది: కైలాష్ వ్యాఖ్యలపై Jairam సెటైర్

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యంగ్యంగా స్పందించారు. 2019లో బీజేపీ ప్రారంభించిన చౌకీదార్‌కి అర్థం ఇప్పుడు తెలిసొచ్చిందంటూ సెటైర్లు విసిరారు. వర్గీయ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘2019లో బీజేపీ ప్రారంభించిన ‘మై బీ చౌకీదార్’కి అర్థం ఇప్పుడు తెలిసొచ్చింది’’ అని ట్వీట్ చేశారు.


విజయ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం అగ్నిపథ్ పథకంపై విజయ వర్గీయ మాట్లాడుతూ ''అగ్నివీరులు మిలటరీలో నాలుగేళ్లు శిక్షణ పొంది సర్వీసు నుంచి బయటకు వచ్చేటప్పుడు రూ.11 లక్షలు పొందుతారు. అగ్నివీర్ బాడ్జి కూడా ఉంటుంది. బీజేపీ కార్యాలయానికి సెక్యూరీటీ కోసం ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే అగ్నివీరులకు నేను ప్రాధాన్యం ఇస్తాను'' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


యువకులు, దేశంలోని మిలటరీ సిబ్బందిని అగౌరవపరచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. యువత దేశానికి జీవితాంతం సేవలందించేందుకు రేయింబవళ్లు కష్టపడి శారీరక పరీక్షలు, రాత పరీక్షలు పాసవుతుంటారని, బీజేపీ కార్యాలయంలో గార్డులుగా చేరడానికి కాదని అన్నారు. యూనిఫాంలో ఉన్న వారిని చిన్నచూపు చూసేలా విజయవర్గీయ వ్యాఖ్యలు ఉన్నాయని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఓ ట్వీట్‌లో విమర్శించారు. అగ్నిపథ్ స్కీమ్‌పై ఉన్న అనుమానాలను బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ నివృత్తి చేశారంటూ కాంగ్రెస్ చురకలు వేసింది. ఇలాంటి ఆలోచనాధోరణికి వ్యతిరేకంగానే తాము అగ్నిపథ్ నిరసనకారులకు సంఘీభావంగా సత్యాగ్రహ్‌ చేపట్టినట్టు తెలిపింది.

Updated Date - 2022-06-20T02:29:09+05:30 IST