‘మిషన్ భగీరథ’ స్ఫూర్తితో బెంగాల్లో ‘జలస్వప్న’
ABN , First Publish Date - 2020-07-07T08:05:22+05:30 IST
‘మిషన్ భగీరథ’ స్ఫూర్తితో బెంగాల్లో ‘జలస్వప్న’
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించేందుకు తెలంగాణ సర్కారు చేపట్టిన బృహత్తర కార్యక్రమం ‘మిషన్ భగీరథ’. దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ‘భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకుని పశ్చిమ బెంగాల్ సర్కారు ‘జల్ స్వప్న’ అనే భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, బెంగాల్లోని 2 కోట్ల గ్రామీణ కుటుంబాలకు తాగునీరందిస్తామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తాజాగా ప్రకటించారు. తెలంగాణలో భగీరథ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన కొద్ది రోజులకే, దాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన బెంగాల్ ప్రభుత్వ బృందం 2015 న వంబరు 4న ఇక్కడకు వచ్చింది. అప్పుడు మంత్రి కేటీఆర్తో పాటు ప్రాజెక్టు అధికారులతో వారు భేటీ అయ్యారు. మమత తాజా ప్రకటన నేపథ్యంలో.. కేటీఆర్ తన ట్విటర్లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచనలను దేశం అనుసరిస్తుందని అనేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాన్ని బెంగాల్లో అమలు చేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.