-
-
Home » Andhra Pradesh » janasena chief pawan kalyan andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: Pawan
ABN , First Publish Date - 2022-05-11T17:45:22+05:30 IST
రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు... ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు... ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుఫాను నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి పంట కోతకోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరమని అన్నారు. అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు.
ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలన్నారు. ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. కాబట్టి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అసని ప్రభావం వల్ల పండ్ల తోటలకు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారని చెప్పారు. పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలన్నారు. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలని అన్నారు. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.