
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు అని చెప్పి కేవలం మూడు వేల ఉద్యోగాలు ప్రకటించారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకి అండగా జనసేన పార్టీ ఉంటుందన్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో జనసేన గెలిచే విధంగా ప్రణాళికలు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. బూతులు తిట్టే నేతలు ఉంటే సమాజం ఎటు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి చేసి పథకాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.
రెండు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని, సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. ఇద్దరు సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నామని ప్రకటించారని, మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందన్నారు. కులాలని పైకి తీసుకురావడం అంటే కార్పొరేషన్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు. అధికారం లేని కులాలకు అధికారం తెచ్చే విధంగా జనసేన పని చేస్తుందని, దానిని సాధిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.