రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చా: పవన్
ABN , First Publish Date - 2020-12-02T17:20:15+05:30 IST
నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది.
కృష్ణా: నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. జిల్లా ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను జనసేనాని పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను కలసిన పలువురు రైతున్నలు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్తో చెప్పుకుని ఉయ్యూరు రైతులు విలపించారు. పవన్తో రైతులు తమ బాధను పంచుకున్నారు. ఎకరాకు ౩౦వేల వరకు ఖర్చు పెట్టామని... నివార్ తుపానుతో సర్వం నష్ట పోయామని వాపోయారు. ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటకుపోలేదని, తమకు ప్రభుత్వం సాయం అందించడం లేదని తెలిపారు. వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు తమ గోడును వెల్లదీసుకున్నారు.
రైతుల ఆవేదనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ...నివార్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని... రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు.