రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2021-11-27T05:02:54+05:30 IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించే నూతన పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ
ధాన్యం కొనుగోలుపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ దినేష్‌కుమార్‌

జేసీ దినేష్‌కుమార్‌

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించే నూతన పద్ధతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ-క్రాప్‌లో నమోదు చేసుకొన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 99 శాతం ఈ-క్రాప్‌ బుకింగ్‌ జరిగిందన్నారు. ఈ-కేవైసీ కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఏ-గ్రేడ్‌ వెరైటీ క్వింటాల్‌కు రూ.1,960, కామన్‌ వెరైటీకి రూ.1,940గా ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. జిల్లాకు 3.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నామన్నారు. తేమ 17 శాతం లోపు ఉండాలని చెప్పారు. ధాన్యం సేకరణకు అవసరమైన సంచులు, వాహనాలు సిద్ధం చేసుకొని రైతు పొలం నుంచే మిల్లుకు పంపాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.శివరాంప్రసాద్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ఆర్‌జే కృష్ణారావు, డీఎస్‌వో పద్మశ్రి, డీసీవో రాజశేఖర్‌, వ్యవసాయ శాఖ డీడీ టి.మురళీ పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-11-27T05:02:54+05:30 IST