బీజేపీ నేత ఇల్లు కూల్చివేతకు ఆదేశం

ABN , First Publish Date - 2021-11-11T20:22:34+05:30 IST

జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్‌, ఆయన భార్య మమతా సింగ్‌ కట్టుకున్న..

బీజేపీ నేత ఇల్లు కూల్చివేతకు ఆదేశం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్‌, ఆయన భార్య మమతా సింగ్‌ కట్టుకున్న బంగళాను కూల్చివేయానికి జమ్మూ డవలప్‌మెంట్ అధారిటీ (జేడీఏ) అనుమతి ఇచ్చింది. నగ్రోట్రాలోని ఆర్మీ అమ్యునేషన్ డిపో సమీపంలోని బాన్ గ్రామంలో నిర్మల్ సింగ్ ఈ భవనం కట్టుకున్నారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా భవనం కట్టుకున్నందున దానిని కూల్చివేయాలని జేడీఏ ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 8న జేడీఏ ఈ ఆదేశాలిచ్చింది. ఐదు రోజుల లోపు అక్రమ కట్టడాన్ని తొలగించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో జేడీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ స్వయంగా కూల్చివేత చేపడుతుందని, అందుకయ్యే ఖర్చులు ల్యాండ్ రెవెన్యూ కింద ఆయన నుంచి వసూలు చేయడం జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.


కాగా, దీనిపై నిర్మల్ సింగ్ స్పందించారు. కూల్చివేత ఉత్తర్వులను కోర్టులో సవాలు చేయాల్సిందిగా తన లాయర్లను కోరినట్టు ఆయన చెప్పారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఆయన ప్రస్తావిస్తూ, ఇవాల్టికీ వేలాది ఇళ్లు జమ్మూలో నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. బటిండా వైపు మాత్రం అధికారులు కన్నెత్తి చూడటం లేదని అన్నారు. ఎన్‌సీ నేత ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఇళ్లు అక్కడ ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. చట్టమనేది అందరికీ ఒక్కటేనని, తనకు మాత్రమే ఎందుకు వర్తింపజేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తన వ్యవహారం వెనుక ఒక జీహాద్ గ్రూప్ ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఆ సంస్థ పేరు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

Updated Date - 2021-11-11T20:22:34+05:30 IST