జేడీయూ నేత అజయ్ అలోక్ భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-07-14T14:16:54+05:30 IST
బీహార్లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
పట్నా: బీహార్లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జేడీయూ నేత అజయ్ అలోక్ భార్య, వారి ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్గా తేలారు. అజయ్ ఒక ట్వీట్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. తన భార్య, కుమార్తె, కొడుకు... ముగ్గురూ కరోనా పాజిటివ్ అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని తెలిపారు. గత 5 రోజులుగా తమలో తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయన్నారు. మరోమారు కరోనా టెస్టులు నిర్వహించాక పరిస్థితి స్పష్టమవుతుందన్నారు. దీనికి ముందు ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, మంత్రి వినోద్ సింగ్, శాసనమండలి చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందిన తరువాత వీరంతా కోలుకున్నారు. బీహార్లో కొత్తగా 1166 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17,421కు పెరిగింది.