అక్టోబరు 3న జేఈఈ అడ్వాన్స్డ్
ABN , First Publish Date - 2021-07-27T06:53:23+05:30 IST
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. అక్టోబరు 3వ తేదీన పరీక్షను
- అర్హత ఉండీ గత ఏడాది హాజరుకాని వారికి చాన్స్
- మళ్లీ మెయిన్ రాయకుండానే అడ్వాన్స్డ్ రాయొచ్చు
- కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు వెలువడ్డాయి. అక్టోబరు 3వ తేదీన పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈసారి పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించనుంది. విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ ్జ్ఛ్ఛ్చఛీఠి.్చఛి.జీుఽ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పరీక్ష విధానంలో మార్పులు చేశారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2020 పరీక్షకు క్వాలిఫై అయినప్పటికీ... కరోనా, ఇతరత్రా కారణాల వల్ల చాలామంది పరీక్ష రాయలేకపోయారు. ఇలాంటి విద్యార్థులకు అడ్వాన్స్డ్ 2021 పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు. ఈ విద్యార్థులు మళ్లీ జేఈఈ మెయిన్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీరిని ఈ ఏడాది మెయిన్ ఉత్తీర్ణులకు అదనంగా పరిగణిస్తారు. అందువల్ల మెయిన్ 2021 నుంచి అడ్వాన్స్డ్కు అర్హులయ్యే విద్యార్థుల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు.
ఎప్పటిలాగే టాప్లో ఉండే 2.5 లక్షల మందికి అవకాశం కల్పిస్తారు. దేశంలోని 23 ఐఐటీలు అందిస్తోన్న ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్ సీట్లను అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. గత జూలై 3వ తేదీన జరగాల్సిన అడ్వాన్స్డ్ పరీక్ష కరోనా కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.