జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన ప్రచోధన్‌

ABN , First Publish Date - 2021-10-17T06:08:51+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన ప్రచోధన్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన ప్రచోధన్‌
తల్లిదండ్రులతో ప్రచోధన్‌

జాతీయ స్థాయిలో ఎస్టీ కేటగిరీలో ప్రథమ ర్యాంకు


వరంగల్‌ సిటీ, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన బిజిలి ప్రచోధన్‌ ఎస్జీ కేటగిరి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. వరంగల్‌ మండలం పైడిపల్లికి చెందిన బిజిలి రామయ్య-అరుణ అనే ఉపాధ్యాయ దంపతుల ప్రథమ కుమారుడు ప్రచోధన్‌ దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ఎస్టీ కేటగిరి ప్రథమ ర్యాంకు సాధించాడు. ప్రచోధన్‌ తండ్రి ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడీఏ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తుండగా తల్లి అరుణ వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల ఎంపీపీఎ్‌సలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ప్రచోధన్‌ ప్రీప్రైమరీ నుంచి 7వ తరగతి వరకు వరంగల్‌లోని ఒయాసిస్‌ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఎస్సార్‌ ప్రైమ్‌లో చదివాడు. 


కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చేస్తా...

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదువుతాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐఐటీలో చేరాలనే కోరిక బలపడింది. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన సిలబ్‌సను పూర్తిగా చదివాను. వారి సలహాలు, సూచనల ప్రకారం రోజుకు అయిదు గంటలు చదివాను. సబ్జెక్టుల వారిగా షెడ్యూల్‌ను తయారు చేసుకొని చదివాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే నేను జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాను. 

Updated Date - 2021-10-17T06:08:51+05:30 IST