జిల్లా ఆత్మగౌరవం జెన్కో థర్మల్ కేంద్రం
ABN , First Publish Date - 2022-05-17T04:42:36+05:30 IST
శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం(జెన్కో) జిల్లా ప్రజల ఆత్మగౌరవమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్ అన్నారు.
ముత్తుకూరు, మే16 : శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం(జెన్కో) జిల్లా ప్రజల ఆత్మగౌరవమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్ అన్నారు. నేలటూరులోని జెన్కో థర్మల్ కేంద్రం వద్ద సోమవారం ఆందోళన చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా ఆయన జనసేన నాయకులతో కలసి నిరసన తెలిపి మాట్లాడారు. రూ. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన జెన్కో థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూడడం అమానుషమని, జెన్కో ఉద్యోగులు, కార్మికుల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం దారుణమని అన్నారు. జెన్కో నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన వేల ఎకరాల భూములకు సంబంధించి నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయగల్గిన జెన్కో థర్మల్ కేంద్రాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని చూస్తే సహించబోమన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తామన్నారు.