office of profit matter: నాపై అనర్హత వేటా? మండిపడిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-08-25T22:09:53+05:30 IST

రాంచీ: తనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిందంటూ వెలువడిన కథనాలపై జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మండిపడ్డారు.

office of profit matter: నాపై అనర్హత వేటా? మండిపడిన ముఖ్యమంత్రి

రాంచీ: తనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిందంటూ వెలువడిన కథనాలపై జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ మండిపడ్డారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారమూ అందలేదని స్పష్టం చేశారు. నివేదికను బీజేపీ తన తొత్తులతో రాయించి ఉంటుందని ఆయన ఆరోపించారు.  


అంతకు ముందు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేరు మీద ఓ గనుల తవ్వకం లీజు ఉందని, లాభదాయక పదవిని నిర్వహిస్తున్నందున ఆయన శాసన సభ్యత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించిందని కథనాలు వెలువడ్డాయి.


ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లాభదాయక పదవిని నిర్వహిస్తున్నందువల్ల ఆయన్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆరోపించారు. గవర్నర్ రమేశ్ బయిస్‌ను కలిసి, ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరింది. దీనిపై గవర్నర్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు పంపించిందని, ఈ నివేదిక రాజ్ భవన్‌కు చేరిందంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ గురువారం జార్ఖండ్ చేరుకోగానే ఎన్నికల కమిషన్‌ నివేదికను వెల్లడిస్తారని తెలుస్తోంది. 


ఈసీఐ మొదట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. సోరెన్‌కు మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ పత్రాలన్నిటినీ పరిశీలించిన తర్వాత మే 2న సోరెన్‌కు నోటీసు ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీఐ ధర్మాసనం సమక్షంలో బీజేపీ, సోరెన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోరెన్ తరపు న్యాయవాదుల వాదనలు ఆగస్టు 12తో ముగిశాయి. బీజేపీ ఆగస్టు 18న ఓ రిజాయిండర్‌ను సమర్పించింది. గనుల మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తోన్న సోరెన్ తనకు తానే మైనింగ్ లీజును మంజూరు చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది. 

Updated Date - 2022-08-25T22:09:53+05:30 IST