ఇద్దరినీ ప్రేమించా.. ఒకే వేడుకలో ఇద్దరిని పెళ్లి చేసుకున్న యువకుడు..

ABN , First Publish Date - 2022-06-21T03:01:55+05:30 IST

ఓ యువకుడు ఒకే వేడుకలో ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్నాడు. ఈ అసహజ వివాహం జార్ఖండ్‌లోని లోహర్డగా వెలుగుచూసింది.

ఇద్దరినీ ప్రేమించా.. ఒకే వేడుకలో ఇద్దరిని పెళ్లి చేసుకున్న యువకుడు..

లోహర్డగా, జార్ఖండ్ : ఓ యువకుడు ఒకే వేడుకలో ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్నాడు. అసహజమైన ఈ వివాహం జార్ఖండ్‌లోని లోహర్డగాలో వెలుగుచూసింది. కొత్తగా పెళ్లైన ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరడం ఈ పెళ్లిలో ఆసక్తికరమైన విషయం. బాలికలు కుసుం లక్రా, స్వాతి కుమారి ఇద్దరూ పెళ్లి కొడుకు సందీప్ ఒరాన్‌ను ప్రేమించారు. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపారు. దీంతో భంద్రా బ్లాక్‌లోని బండా గ్రామస్థుల సమక్షంలొ ఒకే సమయంలో ఇద్దరనీ పెళ్లి చేసుకున్నాడు.


కథ మొదలైందిలా..

ఒకే గ్రామానికి చెందిన సందీప్, కుసుం మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. అయితే సరిగ్గా ఏడాదిక్రితం వీరి లవ్‌స్టోరీ మలుపుతిరిగింది. ఇటుక బట్టీలో పనిచేసేందుకు సందీప్ పశ్చిమ బెంగాల్ వెళ్లాడు. అదే బట్టీలో పని చేయడానికి వచ్చిన స్వాతి కుమారితో సందీప్‌కి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. సందీప్, స్వాతి కుమారి ఎవరి ఇళ్లకు వారు వెళ్లినపోయాక కూడా కూడా వీరిమధ్య బంధం కొనసాగింది. క్రమంగా వీరి విషయం కుటుంబ  సభ్యులతోపాటు గ్రామస్థులకు కూడా తెలిసిపోయింది. దీంతో వీరి సంబంధాన్ని తప్పుబట్టారు. ఇదే విషయమై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అయినా వీరు దూరమవ్వలేదు. దీంతో గ్రామపెద్దలు  పంచాయితీ పెట్టారు. బాలికలు కుసుం లక్రా, స్వాతి కుమారి ఇద్దరినీ సందీప్ పెళ్లి చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు. ఈ పంచాయితీని కుటుంబ సభ్యులెవరూ తిరస్కరించలేదు. దీంతో ఇద్దరి మెడల్లోనూ సందీప్ తాళి కట్టాడు. ఒకేసారి ఇద్దరినీ పెళ్లి చేసుకోవడంపై చట్టపరమైన సమస్యలు ఉండివుండొచ్చు. కానీ తాను ఇద్దరినీ ప్రేమించాను. ఇద్దరిలో ఎవరు లేకపోయిన ఉండలేనని సందీప్ మనసులో మాట చెప్పాడు.

Updated Date - 2022-06-21T03:01:55+05:30 IST