జీవో నెం.10ని ఉపసంహరించుకోవాలి: డీలర్ల డిమాండ్
ABN , First Publish Date - 2021-10-27T04:45:51+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.10ని ఉపసంహరించుకోవాలని ఆదోని రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నగౌడ్ డిమాండ్ చేశారు.
ఆదోని(అగ్రికల్చర్), అక్టోబరు 26: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.10ని ఉపసంహరించుకోవాలని ఆదోని రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మార్కెట్ యార్డులోని పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్ గోడౌన్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసిన గోనె సంచులను ఖాళీ అయ్యాక తిరిగి ఇవ్వాలని కోరడం సబబు కాదన్నారు. ఖాళీ గోనె సంచులు లెక్కల్లోకి రావని అన్నారు. అందుకు జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో రేషన్ డీలర్ కమిషన్ కూడా చెల్లించాలని కోరారు. స్టాక్ పాయింట్ గోదాం నుంచి రేషన్ తుకాల్లో తేడా లేకుండా డీలర్లకు సరఫరా చేయాలని అన్నారు. కార్యక్రమంలో గోపాల్, రాజు, పద్మాకర్, నరేంద్ర, అహమ్మద్, శివ పాల్గొన్నారు.
నందవరం: మండలంలోని ముగతి ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ దగ్గర డీలర్లు జీవో నెంబరు 10ని రద్దు చేయాలంటూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం నాయకులు ఎద్దుల య్య, మీసాల సంపత్గౌడు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఇబ్బంది కలిగేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలల క్రితం ప్రభుత్వానికి అందజేసిన ఖాళీ సంచులకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. డీలర్లకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారి సంక్షేమానికి సీఎం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీలర్లు ఫొటో శీను, ఆనంద్, రాఘవేంద్ర, పేట ఈరన్న, రాజశేఖర్గౌడు, తిమ్మాపురం ఆనంద్, జోష్ పాల్గొన్నారు.