ప్రజలను సాధికారులను చేయడంలో కాంగ్రెస్ విఫలం : జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-11-17T22:18:25+05:30 IST

కాంగ్రెస్ గడచిన 70 ఏళ్ళలో ప్రజలను సాధికారులను

ప్రజలను సాధికారులను చేయడంలో కాంగ్రెస్ విఫలం : జేపీ నడ్డా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ గడచిన 70 ఏళ్ళలో ప్రజలను సాధికారులను చేయడానికి బదులుగా ఓట్ల కోసం తాయిలాలు పంచిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా ప్రజలను స్వయం సమృద్ధులుగా, సాధికారులుగా చేస్తోందన్నారు. ఢిల్లీలోని మోడల్ టౌన్ వద్ద సర్తాక్ చౌపాల్ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. 




ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వంటి పథకాలు మారుతున్న భారత దేశానికి ప్రతిబింబమని చెప్పారు. ‘‘కాంగ్రెస్ 70 ఏళ్ళలో చేసిందేమిటి? వాళ్ళు కేవలం తాయిలాలు పంచి, ఎన్నికల్లో ఓట్లు పొందేవారు. ప్రజలు తమ కాళ్ళపై తాము నిలబడటానికి, సాధికారులవడానికి కాంగ్రెస్ సాయం చేయలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చి 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు మంజూరు చేశారు’’ అని తెలిపారు. 


పేదలకు కావలసినది డబ్బుకాదని, సాధికారత అని తెలిపారు. ఆయుష్మాన్ యోజన వల్ల 55 కోట్ల మంది లబ్ధి పొందుతారన్నారు. రిక్షా తొక్కేవారు, క్షురకులు సహా అనేక మంది పేదలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చునని తెలిపారు. ఎనిమిది కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్లు, విద్యుత్తు సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఇది పరివర్తన చెందుతున్న భారత దేశం దృశ్యమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-17T22:18:25+05:30 IST