జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం... మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయింది: ఎమ్మెల్యే షకీల్
ABN , First Publish Date - 2022-03-18T22:01:33+05:30 IST
జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని, ఆమె పడేయడంతోనే చిన్నారి చనిపోయిందని తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా ఫ్యామిలీకి చెప్పానని పేర్కొన్నారు. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గురువారం యాక్సిడెంట్ జరిగిన కారు నా కజిన్ది. ఆ కారు నేను కూడా అప్పుడప్పుడు వాడతాను. అందుకే ఆ కారుకు నా స్టిక్కర్ అంటించారు. ప్రమాదం ఘటన తెలియగానే నా కజిన్ మీర్జాతో మాట్లాడాను. కారు నడిపింది నా కజిన్ మీర్జా కొడుకు’’ అని షకీల్ తెలిపారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరిట స్టిక్కర్ ఉంది. రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1 వైపు మహీంద్రా కారు వెళ్లింది. తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొట్టింది.
ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి. కారును నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన మహిళలతోపాటు చిన్నారి మృతదేహాన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళలను మహారాష్ట్రకు చెందిన కాజల్చౌహాన్, సారికచౌహాన్, సుష్మ భోంస్లేగా, మృతిచెందిన చిన్నారిని రణవీర్ చౌహాన్గా గుర్తించారు.