మొన్న కరోనా..నిన్న జీ4.. ఇప్పుడు మరో మహమ్మారి!
ABN , First Publish Date - 2020-07-06T14:01:22+05:30 IST
మొన్న కరోనా.. నిన్న జీ4.. నేడు బుబోనిక్ ప్లేగు!! అంటువ్యాధులకు పుట్టినిల్లంటూ అపఖ్యాతిని కూడగట్టుకుంటున్న చైనాలో ఇప్పుడు మరో మహమ్మా
- మొన్న కరోనా.. నిన్న జీ4.. ఇప్పుడు బుబోనిక్ ప్లేగు
బీజింగ్, జూలై 5 : మొన్న కరోనా.. నిన్న జీ4.. నేడు బుబోనిక్ ప్లేగు!! అంటువ్యాధులకు పుట్టినిల్లంటూ అపఖ్యాతిని కూడగట్టుకుంటున్న చైనాలో ఇప్పుడు మరో మహమ్మారి చాపకింద నీరులా ప్రబలుతోంది. అదే ‘బుబోనిక్ ప్లేగు’. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలైన జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంధుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతున్న ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబికులు, సన్నిహితులందరినీ గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడో దశ ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. దీనిని చైనా ప్రభుత్వ ఆన్లైన్ వార్తాసంస్థ ‘పీపుల్స్ డైలీ ఆన్లైన్’ కూడా ధ్రువీకరించింది. దీన్నిబట్టి బయన్నుర్ నగరంలో ‘బుబోనిక్ ప్లేగు’ తీవ్రత ఏ స్థాయిలో ముదిరి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
చైనాకు ఉత్తర సరిహద్దులో ఉన్న మంగోలియాదేశంలోనూ బుబోనిక్ వేగంగా వ్యాపిస్తోంది. మర్మోట్ జాతికి చెందిన ఎలుక మాంసం తిన్న ఇద్దరికి ఆ వ్యాధి సోకిందని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా జూలై 1న ఓ వార్తను ప్రచురించింది. ఆ ఘటనలో ఇన్ఫెక్షన్కు గురైన వారి కుటుంబీకులు, సన్నిహితులు 146 మందిని ఐసొలేట్ చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. ప్లేగు మూడు రకాలు. వాటిలో ఒక రకం బుబోనిక్ ప్లేగు. ఈ ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం. ఇది ఎలుకలు, గుమ్మడి పురుగులను వాహకాలుగా వాడుకుంటుంది. అవి మనుషులను కుడితే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను కలుగజేస్తుంది.