వట్టి మాటలు భారత్‌కు, ఉద్యోగాలు చైనాకు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-02-04T21:55:32+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’పై

వట్టి మాటలు భారత్‌కు, ఉద్యోగాలు చైనాకు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. వట్టి మాటలు భారత దేశానికి, ఉద్యోగాలు చైనాకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చైనా నుంచి కొని తెచ్చుకోవడం’గా ఈ పథకం మారిందని దుయ్యబట్టారు. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలను, అవ్యవస్థీకృత రంగాన్ని మోదీ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైనా నుంచి దిగుమతులు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయన్నారు. 


రాహుల్ గాంధీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘వట్టి మాటలు భారత దేశానికి, ఉద్యోగాలు చైనాకు. అత్యధిక ఉద్యోగాలను సృష్టించే అవ్యవస్థీకృత రంగం, MSMEలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీని ఫలితంగా ‘మేక్ ఇన్ ఇండియా’ ఇప్పుడు ‘చైనా నుంచి కొనుక్కోండి’గా మారింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఈ ట్వీట్‌తోపాటు 1.30 నిమిషాల వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ వాగ్దానం చేసిందని, ఇప్పటికీ చైనా నుంచి కొంటోందని ఆరోపించారు. 2021లో చైనా నుంచి దిగుమతులు రికార్డు స్థాయిలో 46 శాతం పెరిగాయన్నారు. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని పేర్కొన్నారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలకు సంబంధించిన కొన్ని భాగాలను కూడా దీనిలో చేర్చారు. 


భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని మోదీ ప్రభుత్వం పరిష్కరించలేకపోతుండటంపై కూడా కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-02-04T21:55:32+05:30 IST