Jupiterని ఆ గ్రహశకలం ఢీకొట్టినప్పుడు ఏం జరిగిందంటే....
ABN , First Publish Date - 2021-10-23T00:26:30+05:30 IST
సూర్యకుటుంబంలో అతిపెద్దదైన గురుగ్రహం ఖగోళ శాస్త్రవేత్తలతోపాటు అందరికీ ఈ గ్రహంపైనే కన్ను
న్యూఢిల్లీ: సూర్యకుటుంబంలో అతిపెద్దదైన గురుగ్రహం ఖగోళ శాస్త్రవేత్తలతోపాటు అందరికీ ఈ గ్రహంపైనే కన్ను. పరిమాణంలోనే కాదు.. దాని గురుత్వాకర్షణ శక్తి కూడా అందుకు కారణం. దీంతో ఇటీవల ఈ గ్రహంపై పరిశోధలను మరింత ఊపందుకున్నాయి. ఈ గ్రహం ఉత్తర అర్ధగోళంలోని వాతావరణం నుంచి ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లడాన్ని జపాన్లోని కొందరు స్కై వాచర్లు గమనించారు. గురు గ్రహాన్ని ఏదైనా గ్రహశకలం ఢీకొట్టడం వల్లే ఈ కాంతి ఉద్భవించి ఉంటుందని భావిస్తున్నారు. ఆ కాంతి చాలాసేపు వెలుగులు వెదజల్లినట్టు ఓ ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తను ఉటంకిస్తూ ‘స్పేస్.కామ్’ పేర్కొంది. ఆయన ఆ కాంతిని సెలెస్ట్రాన్ సి6 టెలిస్కోప్ ద్వారా పట్టుకోగలిగారు.
అది దాదాపు నాలుగు సెకన్ల పాటు కనిపించినట్టు జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త కో అరిమత్సు సారథ్యంలోని బృందం నిర్ధారించింది. చరిత్రలో తొలిసారి బృహస్పతి ఉపరితలంపై చిన్న గ్రహశకలం ఢీకొట్టడం వల్ల వచ్చిన కాంతిని ఏకకాలంలో పరిశీలించడంలో విజయం సాధించినట్టు తెలిపారు. పరిశీలనలలో రెండు వేర్వేరు రకాల కాంతిని గుర్తించామని, అందులో ఒకటి కనిపించేది కాగా, రెండోది పరారుణ (ఇన్ఫ్రారెడ్)లో ఉన్నట్టు పేర్కొన్నారు. దీని వల్ల గురుగ్రహానికి గులాబి రంగు మెరుపు వచ్చినట్టు వివరించారు.