న్యాయమూర్తులు మారితే న్యాయం మారదు
ABN , First Publish Date - 2021-01-22T09:17:20+05:30 IST
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
- ఎన్నికలు పెట్టమంటే పెట్టాలి..
- లేదంటే వాయుదా వేయాలా?
- జగన్ ప్రభుత్వంపై బాబు ఫైర్
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘కొంతమంది ఏవో కలలు కంటున్నారు. న్యాయం.. సత్యం. అది నిలబడే ఉంటుంది. ఒకచోట ఏదైనా ఇబ్బంది వచ్చినా తర్వాతి దశలోనైనా అది నిలబడుతుంది’ అని గురువారమిక్కడ విలేకరులతో అన్నారు. ‘ఎన్నికల్లో గెలిచినవారు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. కానీ తాము గెలిచాం కాబట్టి రాజ్యాంగం కూడా తాము చెప్పినట్లు వినాలని ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నవారు భావిస్తున్నారు. శాసనమండలి వినకపోతే అది రద్దు. తర్వాత మళ్లీ దానికే నామినేషన్లు. ఇక మీకు వ్యక్తిత్వం ఎక్కడుంది? చెప్పినట్లు వినకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తీసివేస్తారు.
ఎన్నికలు పెట్టమంటే పెట్టాలి.. వాయిదా వేయమంటే వేయాలి.రేపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా తామే పెట్టుకుని తామే నామినేషన్లు వేసుకుంటారేమో! కోర్టులు అంటే లెక్కలేదు. మీడియాలోని పిరికితనాన్ని ఆసరా చేసుకుని విర్రవీగుతున్నారు. ఒకటి రెండు టీవీలు చూపిస్తుంటే వాటిని నిలిపివేస్తున్నారు. దానికి కూడా ప్రత్యమ్నాయం వస్తుంది’ అని ఆయన అన్నారు.