దళితులపై దాడుల కేసులలో న్యాయం జరగడం లేదు: హర్షకుమార్
ABN , First Publish Date - 2020-09-26T21:45:54+05:30 IST
దళితులపై దాడుల కేసులలో న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
విజయవాడ: దళితులపై దాడుల కేసులలో న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ చీరాల యువకుడు కిరణ్ కేసును విచారణకు వచ్చే సమయానికి ఉపసంహరించుకున్నారని, దీంతో ఆ కేసులో తానే పిల్ వేయాల్సి వచ్చిందని తెలిపారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారని, విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేశాయని, రైలు దహనం ఘటనలో కాపులపై కేసులు ఎత్తివేశారని ఆరోపించారు. రిలయన్స్ మాల్స్పై దాడులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని, దళితులపై ఉన్న ఒక్క కేసును కూడా ఎత్తివేయలేదని ధ్వజమెత్తారు. దళితులపై కేసుల జాబితాను సీఎం జగన్కు పంపామని హర్షకుమార్ తెలిపారు.