వికలాంగుల సంక్షేమమే ధ్యేయం
ABN , First Publish Date - 2020-10-27T08:13:15+05:30 IST
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీటవేసి అధిక నిధులు ఖర్చు చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
2 నుంచి పాఠశాలలు ప్రారంభం
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
కడప(ఎడ్యుకేషన్), అక్టోబరు 26: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీటవేసి అధిక నిధులు ఖర్చు చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో సోమవారం కలెక్టరు హరికిరణ్ అధ్యక్షతన జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖమంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 16 నెలల కాలంలో మనబడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న వసతిదీవెన, వైఎ్సఆర్ కంటివెలుగు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ముఖ్యంగా విద్యకు అధిక నిధులు కేటాయించి ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఆదాయం గణనీయంగా పడిపోయినా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు.
వికలాంగులను వివక్షతో చూడ్డానికి వీల్లేదని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేడు రూ.38,76,900 ఖర్చు చేసి 659 మంది విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్చైౖర్స్, సీసీవీల్చైౖర్స్ అందించడం జరిగిందన్నారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరంలేదన్నారు. ప్రతి పాఠశాల దగ్గరలోని పీహెచ్సీలలో డాక్టర్లను అందుబాటులో ఉంచి స్కూళ్లు, క్లస్టర్లలో 108 వాహనాన్ని కూడా ఉంచడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంతి ఎస్బీ అంజద్బాషా, ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎంపీ అవినా్షరెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, జఖియాఖానం, జాయింట్ కలెక్టర్లు సాయికాంత్వర్మ, ధర్మచంద్రారెడ్డి, డీఈవో శైలజ, ఏఎస్పీవో అంబవరపు ప్రభాకర్రెడ్డితో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు.