నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత
ABN , First Publish Date - 2021-04-16T16:49:46+05:30 IST
ప్రముఖ డాక్టర్, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు (96) కన్నుమూశారు.
హైదరాబాద్: ప్రముఖ డాక్టర్, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు (96) కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన కిమ్స్లో చేరారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన కాకర్ల సుబ్బారావు స్వస్థలం కృష్ణా జిల్లా, పెదముత్తేవి. ఆయన 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వ విద్యాలయం నుంచి వైద్య పట్టా పొందిన కాకర్ల సుబ్బారావు 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పద్మావతి మహిళా వైద్యకళాశాల చైర్మన్గా పనిచేసిన ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్గా పని చేశారు.
కాకర్ల సుబ్బారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డా. కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.