కేటీపీపీ యాష్ టెండర్ను స్థానికులకే కేటాయించాలి
ABN , First Publish Date - 2021-05-10T05:55:25+05:30 IST
కేటీపీపీ యాష్ టెండర్ను స్థానికులకే కేటాయించాలి
చెల్పూరు, మే 9: గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే యాష్ (బూడిద) తరలింపు టెండర్ను స్ధానికులకే కేటాయించాలని బల్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీపతి సదానందం డిమాండ్ చేశారు. ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కో యాజమాన్యం స్వలాభం కోసం స్థానికులకు కాకుండా కమీషన్లకు ఆశపడి ట్రేడర్స్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, ఎంటప్రైజెస్ కంపెనీలకు టెండర్లు కట్టబెడుతోందని విమర్శించారు. దీంతో తమ విలువైన భూములను కోల్పోయిన స్థానికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా 2021-22 సంవత్సరానికి సంబంధించి టెండర్లు స్థానికులకు అప్పజెప్పాలన్నారు. ఈ టెండర్లు దక్కపోతే సుమారు 250 ట్యాంకర్ల యజమానులు, 1500 డ్రైవర్లు, కీనర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సివస్తోందన్నారు. సమావేశంలో కేటీపీపీ ఫ్లైయాష్, ఓనర్స్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ పొన్నం రమేష్, జనరల్ సెక్రటరీ వెంకటరమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజేశ్వర్రావు, అసోసియేషన్ సభ్యులు తదితరులతు పాల్గొన్నారు.