ఓరుగల్లుకు కాకతీయ వారసుడు
ABN , First Publish Date - 2022-06-24T04:47:47+05:30 IST
ఓరుగల్లుకు కాకతీయ వారసుడు
మహారాజ్ కమల్ చంద్ర భంజ్దేవ్ను కలిసిన చీఫ్విప్ వినయ్
ఉత్సవాలను రావలసిందిగా ఆహ్వానం..అంగీకరించిన భంజ్దేవ్
హనుమకొండ, జూన్ 23 (ఆం ధ్రజ్యోతి): కాకతీయ సామ్రాజ్య రా జధాని అయిన ఓరుగల్లుకు కాకతీ య వంశస్థుల వారసుడు రానున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వ తరపున ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ గురువారం కాకతీయ వారసుడు, బస్తర్ మహారాజ్ కమల్ చంద్ర భంజ్దేవ్ను కలిశారు. కాకతీయ ఉత్సవాలకు హాజరుకావలసిందిగా ఆహ్వానిం చారు. ఇందుకు భంజ్దేవ్ అంగీకరించారు. వినయ్భాస్కర్తో పాటు తెలం గాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరిక్రిష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య, గురువారం చత్తీస్గడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ చేరుకొని 22వ బస్తర్ పాలకుడు మహారాజా కమల్ చంద్ర భం జ్దేవ్ కాకతీయను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కాకతీయ ఉత్సవాలకు రావాలిసిందిగా ఆధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భంజ్దేవ్ను శాలువాకప్పి సత్కరించారు. వినయ్భాస్కర్ విజ్ఞప్తిని ఆయన మన్నించారు. ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు.
ఈ సందర్భంగా భంజ్దేవ్ మాట్లాడుతూ.. తన పూర్వీకుల పుట్టినిల్లు తన కూ పుట్టినిల్లేనని, అటువంటి ప్రాంతానికి ఏడు వందల సంవత్సరాల తర్వాత సందర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభు త్వం కాకతీయ సప్తాహం పేరుతో కార్యక్రమాలను నిర్వహించడం శుభపరిణా మమని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారానే చారిత్రక వారసత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయగలమని అన్నారు. వరంగల్ నగరాన్ని చూడాలనే తన చిరకాల కోరిక త్వరలో తీరనున్నందుకు సంతోషిస్తున్నానన్నారు.
ఎవరీ భంజ్దేవ్?
మహారాజా కమల్ చంద్ర భంజ్దేవ్ బస్తర్లో మలికాకతీయ సామ్రాజ్యా న్ని ఏర్పాటు చేసిన అన్నమదేవుడి వారసుడు. 1323లో ప్రతాపరుద్రుడి మర ణం తర్వాత ఆయన సోదరుడు అన్నమదేవుడు దంతేవాడ కేంద్రంగా 13వేల చ.కి.మీ విస్తీర్ణంలో మలి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అన్నమ దేవుడితో మొదలైన కాకతీయ వారసులు ఇప్పటికీ మనుగడలో ఉన్నారు. మహారాజా కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నమదేవుడి వారసుడే. బస్తర్లోని కాకతీయ వారసులు ఇప్పటికీ కాకతీయను తమ దేవుడిగా, ఆరాధ్య దైవంగా కొలుస్తున్న తీరు అబ్బురపరుస్తుంది.