కళా అరెస్టుపై వెల్లువెత్తిన నిరసనలు
ABN , First Publish Date - 2021-01-22T05:20:26+05:30 IST
తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్టుపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా గురువారం పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. రామతీర్థం, సందర్శన సమయంలో జరిగిన ఘటనకు బాధ్యునిగా చేస్తూ గతరాత్రి కళాను రాజాంలో అరెస్టు చేసి పొద్దుపోయాక విడుదల చేసిన విషయం విదితమే.
జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళన
పలుచోట్ల గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ధర్నాలు
ఒంగోలు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరెస్టుపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా గురువారం పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. రామతీర్థం, సందర్శన సమయంలో జరిగిన ఘటనకు బాధ్యునిగా చేస్తూ గతరాత్రి కళాను రాజాంలో అరెస్టు చేసి పొద్దుపోయాక విడుదల చేసిన విషయం విదితమే. అలా అరెస్టు చేయడం అక్రమం, కక్షసాధింపు చర్య అని ఖండిస్తూ గురువారం జిల్లా అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ధర్నాలు, మానవహారాలు, ఇతరరూపాల్లో నిరసనలు తెలిపారు. పర్చూరు, కొండపి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డాక్టర్ స్వామిలు వేర్వేరు ప్రకటనల్లో ఈ అరెస్టును ఖండించారు. నగర టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఇతర నేతలు కామేపల్లి శ్రీనివాసరావు, రావుల పద్మజ, కే.కుసుమకుమారి పాల్గొన్నారు. చీమకుర్తిలో పార్టీ సీనియర్ నాయకులు మన్నం ప్రసాద్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, గొల్లపూడి సుబ్బారావుల నేతృత్వంలో బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒంటికాలిపై నిలిచి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలుపగా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో పార్టీశ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అలాగే దర్శి, పామూరు, ఎస్ఎన్పాడు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరగ్గా గిద్దలూరులో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.