సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కలైసెల్వి

ABN , First Publish Date - 2022-08-08T06:04:42+05:30 IST

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎ్‌సఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా తమిళనాడుకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి

సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కలైసెల్వి

ఆ స్థానంలో నియమితులైన తొలి మహిళగా ఘనత 


చెన్నై, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎ్‌సఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా తమిళనాడుకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. ఈ విభాగానికి అధిపతిగా ఒక మహిళను నియమించడం ఇదే తొలిసారి. ఆమె ప్రస్తుతం కారైక్కుడిలోని సీఐఎస్‌ఆర్‌- సెంట్రల్‌ ఎలకో్ట్ర కెమికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సీఈసీఆర్‌ఐ) డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెను సీఎస్‌ఐఆర్‌ టాప్‌ సైంటిస్ట్‌ బాడీకి డీజీగా నియమించారు. దేశవ్యాప్తంగా ఉన్న 38 రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లకు అధిపతిగా వ్యవహరించే అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అలాగే సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ విభాగం కార్యదర్శిగానూ కలైసెల్వి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. లిథియం-అయాన్‌ బ్యాటరీల రంగంలో విశేష కృషి చేసిన కలైసెల్వి... తొలుత సీఈసీఆర్‌ఐలో ఎంట్రీ లెవల్‌ సైంటిస్ట్‌గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు.


ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ 2019 ఫిబ్రవరిలో సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన కలైసెల్వి 25 ఏళ్లకు పైగా పరిశోధన రంగంలో ఉన్నారు. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి కీలక సహకారం అందించారు. ప్రసుతం సోడియ-అయాన్‌/ లిథియం-సల్ఫర్‌ బ్యాటరీలు, సూపర్‌ కెపాసిటర్ల అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నారు. ఆమె మొత్తం 125 పరిశోధనా పత్రాలను సమర్పించగా, వాటిలో ఆరింటికి పేటెంట్‌ హక్కులను కూడా పొందారు. ఇదిలా ఉండగా, కలైసెల్వికి తమిళనాడు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-08-08T06:04:42+05:30 IST