కళావెంకట్రావు అరెస్టు

ABN , First Publish Date - 2021-01-21T09:04:51+05:30 IST

టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావును బుధవారం రాత్రి విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

కళావెంకట్రావు అరెస్టు

  • రామతీర్థంలో సాయిరెడ్డిపై దాడికి పురిగొల్పారనే 
  • ఆరోపణపై అదుపులోకి.. స్టేషన్‌ బెయిల్‌పై విడుదల
  • రాత్రి 8.30కి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • కళాను బలవంతంగా వాహనంలోకి తోసేసిన వైనం
  • మండిపడ్డ బాబు.. నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
  • దీంతో రాత్రికి రాత్రే కళాను విడుదల చేసిన పోలీసులు


రాజాం/రూరల్‌/చీపురుపల్లి/గుర్ల/విజయనగరం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావును బుధవారం రాత్రి విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భోగాపురం సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలోని ఎస్టీఎఫ్‌ బృందాలు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఆయన ఇంటి వద్దే ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలకు కళాను బాధ్యుడిని చేస్తూ.. విజయసాయిపై దాడికి పురిగొల్పారన్న ఆరోపణలతో అరెస్టు చేసి.. చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక బృందాలు కళా వెంకట్రావు ఇంటిని, కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. సీఐ శ్రీధర్‌తో పాటు మరికొంత మంది పోలీసులు నేరుగా ఇంట్లోకి వెళ్లారు. కళా, ఆయన వ్యక్తిగత సహాయకులు, ఇతర సిబ్బంది చేతుల్లోని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కళాతో సీఐ 20 నిమిషాలు చర్చించారు. రామతీర్థంలో జరిగిన సంఘటనకు సంబంఽధించి అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు.


 కళావెంకట్రావు అవాక్కయ్యారు. అయినా పోలీసులకు సహకరించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కళాను ఇంటి బయటకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఫోన్‌ చేసుకునేందుకు ఆయనకు రెండు నిమిషాల పాటు సెల్‌ఫోన్‌ను అందించారు. ఆయన మాట్లాడుతూ బయటకు వస్తుండగానే.. ఆయన చేతిలోని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను వాహనం వద్దకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో మీడియాతో మాట్లాడేందుకు కళా ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనంలోకి తోసివేశారు. ఇదే సమయంలో కళా తనతో పాటు తీసుకువెళ్లాల్సిన లగేజీ బ్యాగు కింద పడిపోయింది. బ్యాగును ఇచ్చేందుకు యత్నించిన ఆయన వ్యక్తిగత సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను తరలిస్తున్న వాహనం వెనుక డోర్‌ సైతం వేయకుండానే ఇంటి నుంచి తరలించారు. ఈ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపిచ్చారు. చీపురుపల్లి పోలీసు స్టేషన్‌ వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు.


దేవుడిపై దాడి అన్యాయమంటే కేసులా..? 

దేవుళ్లపై దాడుల చేయడం అన్యాయమని అన్నందుకే తమపై కేసులు బనాయించారని కళావెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి స్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో ఆయనే ఐపీసీ సెక్షన్లు వేసి అరెస్టులకు పురిగొల్పారని ఆరోపించారు. 


చంద్రబాబు, తాము కుట్ర చేసి విజయసాయిరెడ్డిపై దాడి చేయించినట్లు, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. దాడులు, కక్ష సాధింపులతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌ నుంచి గాంధీజీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత గణపతిరావుతో కలిసి రాజాం వెళ్లిపోయారు. 


తొలిసారిగా.. కళాపై కేసు నమోదు

సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా కళావెంకట్రావుపై కేసు నమోదైంది. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. ఏనాడూ ఆయనపై ఒక్క పోలీసు కేసు కూడా లేదు. అటువంటి నాయకుడిపై రామతీర్థం ఘటన నేపథ్యంలో కేసుపెట్టిన పోలీసులపై ఆయన అనుయాయులు మండిపడుతున్నారు.


విజయనగరం జిల్లా టీడీపీ నేతల అరెస్టు

కళావెంకట్రావుతో పాటు విజయనగరం జిల్లా టీడీపీ నేతలను కూడా పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్‌ను విజయగనరంలో అరెస్టు చేశారు. నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో  గొర్లి జగన్నాథం, మహంతి శ్రీహరి, అట్టాడ పైడిరాజు, ఎస్‌.నాగరాజు, పూతికపేట గ్రామానికి చెందిన ఎస్‌.రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ కోటపాడు తిరుపతిరావులను నెల్లిమర్ల పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విజయనగరంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.


స్టేషన్‌ బెయిల్‌పై కళా విడుదల

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళావెంకట్రావును రాత్రి 11గంటల ప్రాంతంలో స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, బొబ్బిలి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బేబీనాయన అప్పటికే పోలీసు స్టేషన్‌కు చేరుకుని లాయర్లను కూడా ఏర్పాటు చేశారు. దర్యాప్తునకు సహకరిస్తానన్న పూచీకత్తుతో ఆయన్ను 41 నోటీసుపై పోలీసులు విడుదల చేశారు. ఇంకోవైపు విజయనగరం నుంచి చీపురుపల్లి బయల్దేరిన టీడీపీ శ్రేణులను అశోక్‌గజపతిరాజు బంగళా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్లు మూసివేసి వారిని బంగళాలోనే నిర్బంధించారు. కళాను విడుదల చేసినట్లు సమాచారం రావడంతో కార్యకర్తలు, నాయకులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

Updated Date - 2021-01-21T09:04:51+05:30 IST