కల్లు దుకాణాలకు పోటాపోటీ

ABN , First Publish Date - 2022-10-08T04:55:44+05:30 IST

మామూలుగానే కొత్త జిల్లాలో అదీ.. కర్ణాటక సరిహద్దుల్లో కల్లుకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. దుకాణాల వద్ద జాతరను తలపిస్తుంటుంది.

కల్లు దుకాణాలకు పోటాపోటీ

టీఎ్‌ఫటీ, టీసీఎ్‌సలకు సెప్టెంబరుతో

ముగిసిన లైసెన్సు గడువు

నెలాఖరు వరకు పొడిగింపు

రెన్యువల్‌ కోసం ఎగబడిన 

దుకాణదారులు

దళారుల చేతివాటం

పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి


మామూలుగానే కొత్త జిల్లాలో అదీ.. కర్ణాటక సరిహద్దుల్లో కల్లుకు భారీగా డిమాండ్‌ ఉంటుంది. దుకాణాల వద్ద జాతరను తలపిస్తుంటుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేయడం, బ్రాండెడ్‌ మద్యం సరిగా అందుబాటులో లేకపోవడంతో మత్తు ప్రియులు.. కల్లు దుకాణాలకు క్యూ కడుతున్నారు. సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో కల్లు దుకాణాలు లేవు. ఈ పరిణాయాలు జిల్లా సరిహద్దులో కల్లు దుకాణాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లైసెన్సు ఉంటే కాసులే.. కాసులు. కల్లు దుకాణాల లైసెన్సు రెన్యూవల్‌కు నిర్వాహకులు ఎగబడడమే ఇందుకు నిదర్శనం. ఒక్క నెలకే రెన్యూవల్‌ అయినా.. నిర్వాహకులు మాత్రం వదలట్లేదు. పోటీ పడుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు దళారులు రంగప్రవేశం చేసి, వసూళ్లకు తెరలేపారు. రెన్యూవల్‌ చేయిస్తామంటూ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


జాతరలా..

జిల్లాలో కల్లు దుకాణాల లైసెన్సు రెన్యువల్‌ జాతర సాగుతోంది. సెలవు రోజున కూడా ఎగబడ్డారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్ద టీసీఎస్‌, టీఎ్‌ఫటీల ప్రభుత్వ లైసెన్సు రెన్యూవల్‌ దరఖాస్తుదారులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రందాకా కార్యాలయం వద్ద జాతరను తలపించింది. జిల్లావ్యాప్తంగా టీఎ్‌ఫటీ, టీసీఎ్‌సలకు ఐదేళ్ల కాలానికి ప్రభుత్వం లైసెన్సులు జారీ చేస్తుంది. ఆ గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగిసింది. కొత్త లైసెన్సుల జారీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదు. దీంతో నెలరోజులపాటు లైసెన్సు గడువును పొడిగిస్తూ జిల్లా ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా టీఎ్‌ఫటీ, టీసీఎ్‌సల ప్రభుత్వ లైసెన్సుదారులు గుడువు పొడిగింపు పత్రాల కోసం జిల్లా కేంద్రంలోని కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. నెలరోజులకే అయినా.. లైసెన్సు పత్రం పొందేందుకు పెద్ద కుస్తీనే చేయాల్సి వచ్చింది. 


దళారుల రంగప్రవేశం

లైసెన్సు రెన్యువల్‌కు నెలకొన్న పోటీని సొమ్ము చేసుకునేందుకు దళారులు రంగప్రవేశం చేశారు. వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కల్లు సరఫరా చేసే నిర్వాహకులు లైసెన్సుల గడువు పొడిగించాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందేనని దళారులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని టీఎ్‌ఫటీల రెన్యూవల్‌ కోసం భారీగానే తరలివచ్చారు. ఈనెల 3వ తేదీ నాటికి 70 శాతం రెన్యూవల్‌ ప్రక్రియ పూర్తయినట్లు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. లైసెన్సు రెన్యూవల్‌లో ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులు అంటున్నా.. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో టీఎ్‌ఫటీల లైసెన్సుల రెన్యూవల్‌ వెనుక కొన్నిచోట్ల డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.


మద్యం దుకాణాలను తలదన్నేలా..

జిల్లా ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ పరిధిలో టీసీఎ్‌సలు 79కు 129 మంది, టీఎ్‌ఫటీలు 177 ఉండగా.. 347 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా టీఎ్‌ఫటీ, టీసీఎ్‌సలకు నెలరోజులపాటు రెన్యూవల్‌ గడువు పొడిగింపు కొనసాగుతుంది. జిల్లాకు కర్ణాటక సరిహద్దు ఎక్కువగా ఉంది. హిందూపురం, మడకశిర, ఆగళి, అమరాపురం, లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, పరిగి, రొద్దం, గోరంట్ల, అమడగూరు, ఓబుళదేవరచెరువు, తనకల్లు, వరకు భారీగా కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఉంది. కర్ణాటకలో కల్లు దుకాణాలు లేకపోవడంతో జిల్లా సరిహద్దులోనే భారీగా వెలిశాయి. ఇక్కడ దుకాణాలు తెరవడమే ఆలస్యం కిక్కిరిసి కనిపిస్తున్నాయి. కల్లు దుకాణాల వద్ద చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు సైతం క్యూ కడుతున్నారు. ఇటీవల కల్లు వ్యాపారం నిర్వహించే వారికి ప్రాంతాల వారీగా అధికార పార్టీ అండతో కల్లు మాఫియా చెలరేగుతోంది. మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లో కల్లు దుకాణాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకుల అశీస్సులు లేనిదే వ్యాపారం నడవడం లేదు. అనుబంధంగా వందల సంఖ్యలో అనధికార కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కుగ్రామం నుంచి కర్ణాటక సరిహద్దుదాకా ప్రభుత్వ మద్యం దుకాణాలకు దీటుగా కల్లు వ్యాపారం సాగుతోందన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో టీఎఎ్‌ఫటీ, టీసీఎ్‌సల లైసెన్సు రెన్యూవల్‌కు ఎగబడుతున్నారు.


నెలాఖరుదాకా పొడిగింపు

జిల్లా టీఎ్‌ఫటీ, టీసీఎ్‌సల లైసెన్సు గడువు గతనెల 30వ తేదీతో ముగిసింది. ఈనెల 31 దాకా గడువు పొడిగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు దరఖాస్తు చేసుకున్న టీఎ్‌ఫటీలకు గడువు పొడిగింపు పత్రం అందజేస్తున్నాం. ఇందులో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ లైసెన్సుల రెన్యూవల్‌ పాదర్శకంగానే చేపడుతున్నాం.

రమేష్‌, ప్రొహిబిషన, ఎక్త్సెజ్‌ శాఖ జిల్లా అధికారి


Updated Date - 2022-10-08T04:55:44+05:30 IST