కమలా హ్యారిస్ నిర్ణయాత్మక ఓటుతో.. భారతీయురాలికి దక్కిన కీలక పదవి!
ABN , First Publish Date - 2021-06-23T17:49:48+05:30 IST
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్లో వేసిన తన నిర్ణయాత్మక ఓటుతో ఓ భారతీయ అమెరికన్కు కీలక పదవి దక్కింది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్(ఓపీఎం) హెడ్గా భారత సంతతి న్యాయవాది కిరణ్ అహుజా నామినేషన్ను ధృవీకరించడానికి మంగళవారం సెనేట్లో ఓటింగ్ నిర్వహించారు.
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్లో వేసిన తన నిర్ణయాత్మక ఓటుతో ఓ భారతీయ అమెరికన్కు కీలక పదవి దక్కింది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్(ఓపీఎం) హెడ్గా భారత సంతతి న్యాయవాది కిరణ్ అహుజా నామినేషన్ను ధృవీకరించడానికి మంగళవారం సెనేట్లో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో అహుజా నామినేషన్కు 50 మంది మద్దతు ఇస్తే, మరో 50 మంది వ్యతిరేకించారు. దీంతో నామినేషన్ ధృవీకరణకు ఉపాధ్యక్షురాలి నిర్ణయాత్మక ఓటు తప్పనిసరి అయింది. ఈ క్రమంలో అహుజాకు కమలా మద్దతుగా ఓటు వేశారు. దాంతో 51-50 తేడాతో అహుజా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ హెడ్గా ఎన్నికయ్యారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఉపాధ్యక్షురాలిగా తాను ఆరోసారి తన నిర్ణయాత్మక ఓటు వేసినట్లు కమలా హ్యారిస్ తెలిపారు. ఇక ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అనేది ఫెడరల్ ఏజెన్సీ. దేశంలోని రెండు మిలియన్లకు పైగా సివిల్ సర్వేంట్లను నిర్వహిస్తోంది.
కాగా, 49 ఏళ్ల అహుజా ఒక అమెరికన్ న్యాయవాది, కార్యకర్త. అమెరికా ప్రభుత్వంలో ఈ ఉన్నత స్థానంలో పనిచేయబోతున్న మొదటి భారతీయ అమెరికన్ కూడా. ఈ సందర్భంగా సెనేటర్ డయాన్నే ఫెయిన్స్టెయిన్ మాట్లాడుతూ.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఓపీఎంలో సీనియర్ పాత్రతో సహా అహుజాకు ప్రజా సేవ, దాతృత్వ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందన్నారు. అహుజాకు ఈ రంగంలో ఉన్న అపారమైన జ్ఞానం, అనుభవం ఈ బాధ్యతలు నిర్వహించడంలో ఆమెకు బాగా ఉపయోగపడుతాయని సనేటర్ డయాన్నే పేర్కొన్నారు. ఇక అహుజా 2015 నుండి 2017 వరకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ డైరెక్టర్కు చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఫిలాంథ్రోపీ సంస్థల ప్రాంతీయ నెట్వర్క్ అయిన ఫిలాంథ్రోపీ నార్త్వెస్ట్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.