Kamma Sangam leaders: సభ్యసమాజం తలదించుకునేలా ఎంపీ గోరంట్ల ప్రవర్తన..
ABN , First Publish Date - 2022-08-08T20:10:47+05:30 IST
కమ్మ సామాజిక వర్గంపై ఎంపీ గోరంట్ల చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కమ్మ సంఘం నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ (Hyderabad): కమ్మ (Kamma) సామాజిక వర్గంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ (Telangana) కమ్మసేవా సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో కమ్మసేవా సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ గోరంట్లపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి, స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా గోరంట్ల ప్రవర్తించారని, సిగ్గు లేకుండా కమ్మకులంను కించ పర్చడం దారుణమన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. కమ్మ కులాన్ని కించపరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, కమ్మ సామాజిక వర్గానికి గోరంట్ల మాధవ్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
కాగా ఎంపీ గోరంట్లకు సంబంధించిన అసభ్యకరమైన వీడియో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో మార్పింగ్ చేశారని, తనపై కావాలని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా కమ్మ సామాజిక వర్గంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.