కమ్మమహాజన సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక సేవలు
ABN , First Publish Date - 2021-03-01T04:35:09+05:30 IST
కమ్మ మహాజన సంఘం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంఘ సమావేశంలో నిర్ణయించారు.
సంఘం అధ్యక్షుడు సురేష్
ఖమ్మంటౌన్, ఫిబ్రవరి28: కమ్మ మహాజన సంఘం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంఘ సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం నగరంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో కమ్మ మహాజన సంఘం 26వ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు వేజెళ్ల సురేష్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో 2019-20 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ జమా, ఖర్చులు నివేదికను ఆమోదించారు. అలాగే కమ్మసంఘం బాలికల హాస్టల్లో విద్యార్థినుల సంఖ్యను మరింతగా పెంచాలని, అవసరమైన విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేజెళ్ల సురేష్ మాట్లాడుతూ కరోనా తరుణంలో సంఘం ద్వారా నిత్యావసర వస్తువులు అందించామని, బాలికల హాస్టల్లో విద్యార్థినుల సంఖ్య మరింత పెంచుతున్నామని తెలిపారు. సంఘం ఆర్థిక పటిష్టతకు, బాలికల చదువులకు, విద్యాసామాజిక కార్యక్రమాలకు దాతలు విరాళాలు అందించాలని విన్నవించారు. అందరి సహకారంతో సేవాసంఘం ద్వారా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇదే సహకారం భవిష్యత్లో కల్పించాలని కోరారు. ఎన్నారైలు కొందరు కమ్మ బాలికల వసతిగృహంలో చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి చావా నారాయణరావు, సామినేని హరిప్రసాద్, గరికపాటి వేంకటేశ్వరరావు, ఎర్నేని రామారావు, సంఘం రాష్ట్ర కోశాధికారి రత్నాకర్, దండ్యాల లక్ష్మణరావు, దిరిశాల వేంకటేశ్వరరావు, తాళ్లూరి సృజన్కుమార్, దండ్యాల రవికుమార్, చేకూరి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాలన్నారు. సంఘం చేసే కార్యక్రమాలకు తమవంతు సహకారం ఉంటుందని వివరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, బసవ పున్నయ్య చింతనిప్పు కృషచైతన్య, తదితరులు పాల్గొన్నారు.