కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:29:16+05:30 IST

ప్రజల అవసరాలకు అనుగుణంగా భౌగోళికంగా అందుబాటులో ఉండేలా జిల్లాల ఏర్పాటు జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు.

కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలి
రామకృష్ణతో చర్చిస్తున్న స్థానిక నేతలు

సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

కందుకూరు, జనవరి 28: ప్రజల అవసరాలకు అనుగుణంగా భౌగోళికంగా అందుబాటులో ఉండేలా జిల్లాల ఏర్పాటు జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యలయంలో ఆయన జిల్లాలోని సీపీఐ నాయకులతో ప్రత్యేక సమావేశం న్విహించారు.  ముఖ్యంగా ఒంగోలుకు అతి సమీపంలోని కందుకూరును తీసి సుదూరంగా ఉన్న నెల్లూరులో కలపడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అదేవిధంగా ఒంగోలుకి 150 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురాన్ని ఇప్పుడు కూడా ఒంగోలు జిల్లాలోనే ఉంచడం భావ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయకుమార్‌ జిల్లాల కూర్పులో కొద్దిపాటి లోటుపాట్లతో బాగానే చేసినట్లు తెలిపారు. అయితే చిన్న చిన్న సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు జిల్లాలోనికి గూడూరును కలిపి కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని సూచించారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోని మార్కాపురం ప్రాంతాన్ని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో కలిపి జిల్లాగా ఏర్పాటు అవసరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ యంత్రాంగం కూడా కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడం, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఆందోళనలు చేయాలని, ఈ మేరకు అధికారులకు వినతులు ఇవ్వాలని రామకృష్ణ సూచించారని మాలకొండయ్య తెలిపారు.  సమావేశంలో రైతుసంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, మాజీ ఎమ్మెల్సీ, వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్‌ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణతో పాటు  మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి అందె నాసరయ్య, కందుకూరు ప్రాంత నాయకుడు పి. బాలకోటయ్య, పొదిలి మండల కార్యదర్శి కేవీ.రత్నం పాల్గొన్నారని తెలిపారు.

Updated Date - 2022-01-29T05:29:16+05:30 IST