కనగల్ వాగు ఇసుక రీచ్మూసివేత
ABN , First Publish Date - 2021-05-08T07:23:04+05:30 IST
మండల కేంద్రమైన కనగల్ వాగులో ఇసుక రీచ్ను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు.
తహసీల్దార్ ఆదేశం
కనగల్, మే 7: మండల కేంద్రమైన కనగల్ వాగులో ఇసుక రీచ్ను అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. వాగు బ్రిడ్జితోపాటు నిజాం కాలం నాటి (ఖత్వ)రాతి ఆనకట్టకు అతి సమీపంలో ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. వాగు బ్రిడ్జికి, ఖత్వాలకు ఇరువైపులా 500మీటర్ల పరిధిలోని వాగులో ఇసుక తవ్వకాలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వ్యాపారులు బ్రిడ్జికి అతి సమీపంలోనే ఇసుకను ఎత్తుతున్నారు. దీంతో బ్రిడ్జి మనుగడ ప్రశ్నార్థకమైంది. మరోపక్క వాగును ఆనుకుని ఉన్న పంట భూములకు సంబంధించి రైతులు ఏర్పాటు చేసుకున్న బోరు మోటార్లను, పైపులను ఇసుక ఎత్తుతున్న క్రమంలో అడ్డుగా ఉన్నాయని ఇసుక వ్యాపారులు వాటిని ధ్వంసం చేస్తున్నారు. రైతులు అడ్డుకోబోతే గొడవలు జరుగుతున్నాయి. ఇదేగాక భూగర్భ జాలాలు అడుగంటి సాగు నీటికొరత ఎదురవుతుందని రైతులు వాపోతున్నారు. కనగల్ గ్రామ రైతులు, యువకులు ఇసుక రీచ్ను మూసివేసి ఇసుక మాఫియా ఆగడాలను నియంత్రించాలని తహసీల్దార్ శ్రీనివాస్కు ఇటీవల పిర్యాదు చేశారు. రైతులు తమ పట్టాభూములను దాటుకుని ఎకరాల కొద్ది వాగును ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారని దీని కారణంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్రాక్టర్ యజమానులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ శ్రీనివా్సరావు మైనింగ్ అధికారులతో మాట్లాడి ఇసుక రీచ్ను తాత్కాలికంగా మూసివేయించారు. వాగును సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేసిన అనంతరం ఇసుక ఈచ్ను కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తహసీల్దార్ నిర్ణయంతో ఇసుక రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.