కంగన పోస్టులను అడ్డుకోలేం: సుప్రీం
ABN , First Publish Date - 2022-01-22T07:54:35+05:30 IST
సామాజిక మాధ్యమాల్లో నటి కంగన రనౌత్ చేసే వ్యాఖ్యలను అడ్డుకోవాలంటూ వచ్చిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సిక్కులు, ముంబై పోలీసులపై కంగన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని..
మీరే పట్టించుకోవడం మానేయండి
పిటిషనర్కు ధర్మాసనం సూచన
న్యూఢిల్లీ, జనవరి 21: సామాజిక మాధ్యమాల్లో నటి కంగన రనౌత్ చేసే వ్యాఖ్యలను అడ్డుకోవాలంటూ వచ్చిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సిక్కులు, ముంబై పోలీసులపై కంగన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సర్దార్ చరణ్జీత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా.. కంగన సోషల్ మీడియా వ్యాఖ్యల్ని అడ్డుకోలేమని.. పిటిషనర్ వాటిని పట్టించుకోవడం మానేయటమో లేక.. క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కారాన్ని కనుగొనడమో చేయాలని సూచించింది. కంగన వ్యాఖ్యలపై దాఖలైన ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపి ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్కు మార్చాలని సింగ్ అభ్యర్థించగా.. అది కోరే అవకాశం అతడికి లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అలా విజ్ఞప్తి చేసే అవకాశం కేవలం నిందితులకు మాత్రమే ఉంటుందని వివరించింది.