Raids on Sisodia : ‘పంజరంలో చిలుక’ సీబీఐపై పద్యం రాసిన కపిల్ సిబల్
ABN , First Publish Date - 2022-08-20T17:55:43+05:30 IST
ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా
న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సోదాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘పంజరంలో చిలుక’ సీబీఐ ఇప్పుడు బయటకు వచ్చిందని, దాని ఈకలు కాషాయ రంగులో ఉన్నాయని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానం అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ శుక్రవారం 20 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై కపిల్ సిబల్ (Kapil Sibal) స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. సీబీఐ (CBI) పంజరంలో చిలుక వంటిదని సుప్రీంకోర్టు 2013లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
‘‘సీబీఐ, ఒకప్పుడు ‘పంజరంలో చిలుక’
ఇప్పుడు :
పంజరం నుంచి బయటపడింది.
ఇప్పుడు :
దాని ఈకలు కాషాయ రంగులో ఉన్నాయి
దాని రెక్కలు ఈడీ (Enforcement Directorate)
అది తన యజమాని చెప్పిన మాటలను పలుకుతుంది!’’ అని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎదుగుతున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)ని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కపిల్ ఆరోపించారు.
ఇదిలావుండగా, మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలపై కాంగ్రెస్ (Congress) స్పందిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.