యథాస్థితికి కరంజి(టి) రోడ్డు
ABN , First Publish Date - 2022-05-12T06:27:38+05:30 IST
ఆదిలాబాద్ నుంచి కరంజి(టి) వరకు ఉన్న 40కి.మీ.ల రోడ్డు మూన్నాళ్లకే అధ్వానంగా తయారైంది. ఒకప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే భయం వేసేది. రోడ్డు అధ్వాన పరిస్థితి కారణంగా ఈ రోడ్డుపై ఆర్టీసీ వారు గతంలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) వరుసగా మూడు నెలల పాటు బస్సులను బంధు ఉంచారు.
రోడ్డుపై వెలసిన పెద్దపెద్ద గుంతలు
ప్రయాణం.. నరకప్రాయం
అయినా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
భీంపూర్, మే 11: ఆదిలాబాద్ నుంచి కరంజి(టి) వరకు ఉన్న 40కి.మీ.ల రోడ్డు మూన్నాళ్లకే అధ్వానంగా తయారైంది. ఒకప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే భయం వేసేది. రోడ్డు అధ్వాన పరిస్థితి కారణంగా ఈ రోడ్డుపై ఆర్టీసీ వారు గతంలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) వరుసగా మూడు నెలల పాటు బస్సులను బంధు ఉంచారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడం ఈ రోడ్డు బాగు చేయడం జరిగింది. అంత వరకు బాగానే ఉన్నా.. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఈ రోడ్డుపై బీటీ పైకి వచ్చేసింది. అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. తిరిగి రోడ్డు పూర్వస్థితికి వచ్చేసింది. ఈ రోడ్డుపై బీటీ ప్యాచ్వర్క్ అవసరమై ఉండగా.. ప్రజా పతినిధులు అసలే పట్టించుకోవడం లేదు. యేటా ఇదిగో మంజూరు.. అదిగో మంజూరు.. అని కాలయాపన చేస్తున్నారు. దీంతో ఈ మండలంలో 50 గ్రామాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై ప్రయాణం భయం భయంగా ఉందని వాహనదారులు అంటున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులు నడపడం కష్టం అవుతున్నదని బస్సు డ్రైవర్లు అంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కొందరు లక్ష్మిపూర్ నుంచి భీంపూర్ వరకు 4కి.మీ.ల రెండు వరుసల రోడ్డు వేశారు. ఇంత తక్కువ నిధులతో ఈరోడ్డు ఎందుకు వేశారో వారికే తెలియాలి. 40కి.మీ.ల రోడ్డు మరమ్మతులపై లేని శ్రద్ధ 4కి.మీ. రెండు వరుసల రోడ్డుపై ఎందుకున్న దో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సహా ఎంపీపీ, జడ్పీటీసీలు అధికారులు పట్టించుకుంటే బాగుంటుంది.
సీసీ రోడ్లపై ఉన్న శ్రద్ధ.. ఈ రోడ్లపై ఉంటే బాగుంటుంది
: దాసరి రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పిప్పల్కోటి
ప్రస్తుతం ప్రతీ పంచాయతీలో టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లు ఎంపీటీసీలు సీసీ రోడ్ల నిర్మాణంలో బీజీగా ఉన్నారు. సంతోషమే అయితే మండలం లో 26 పంచాయతీలలో సర్పంచ్లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కలిసి ఈ 40 కి.మీ.ల రోడ్డు గురించి కొంత శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఆర్అండ్బిలోకి మారిన ఈ రోడ్డు ఇంత అధ్వా నంగా ఉండడం సిగ్గు చేటు. ఎన్నో కార్యక్రమాలకు ఈ వైపుగా వచ్చే ఎమ్మెల్యే సార్ దీని గురించి పట్టించుకోక పోవడం విడ్డూరంగా కనిపిస్తున్నది. కనీసం జిల్లా కలెక్టర్ అయినా పట్టించుకుంటే మండల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.