కర్ణాటక మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-06-23T04:11:04+05:30 IST
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి కలువాయికి అక్రమంగా రవాణా చేస్తున్న 550 మద్యం సీసాలను సెబ్ అధికారులు పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.
హైవేలో కాపుకాచి 550 సీసాల స్వాధీనం
వివరాలు వెల్లడించిన సెబ్ అధికారులు
రాపూరు, జూన్ 21 : కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి కలువాయికి అక్రమంగా రవాణా చేస్తున్న 550 మద్యం సీసాలను సెబ్ అధికారులు పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సెబ్ సీఐ నరహరిరావు, స్థానిక ఇన్చార్జి చల్లా శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం ఆ వివరాలను విలేకర్లకు స్థానికంగా వెల్లడించారు. బెంగళూరు నుంచి మద్యం వస్తుందనే సమాచారంతో సెబ్ ఉన్నతాకారుల ఆదేశాలతో సిబ్బంది రాపూరు సమీపంలోని ఎన్హెచ్ 565లోని బండేపల్లి పాఠశాల వద్ద నలుగురు సిబ్బంది పక్కా పల్లెటూరి వారిలా మారి రోజంతా కాపుకాశారు. వెంకటగిరి వైపు నుంచి వేగంగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన 550 క్వార్టర్ మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ మద్యం విలువ సుమారు రూ.85వేలు, వాహనం విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుంది. వాహనంలో ఉన్న దిలీప్, హబీబుల్లాను అరెస్టు చేశాం. కలువాయికి చెందిన చిలకా భాస్కర్రెడ్డికి మద్యం తీసుకెళ్తున్నట్టు వారు తెలిపారు. దాంతో ముగ్గురిపై కేసు నమోదు చేశాం. త్వరలోనే మూడో నిందితుడిని అరెస్టు చేస్తాం’. అని తెలిపారు. మద్యాన్ని పట్టుకున్న సిబ్బంది సుబ్బయ్య, సురేష్, తిరుమలరావు, అజీజ్బాషాలనుు సీఐ ప్రత్యేకంగా అభినందించారు. పట్టుబడ్డ మద్యం సీసాలను సెబీ అక్షరరూపంలో పేర్చి చూపారు.
20 సీసాల స్వాధీనం
రాపూరులోని బెల్టుషాపులో మంగళవారం రాత్రి స్థానిక సెబ్ అధికారులు దాడులు నిర్వహించి 20మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.