Bengalore floods: తప్పు మాది కాదన్న సీఎం

ABN , First Publish Date - 2022-09-07T00:44:01+05:30 IST

భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం కావడం, వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ బృందాలు ..

Bengalore floods: తప్పు మాది కాదన్న సీఎం

బెంగళూరు: భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం కావడం, వరద నీటిలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ బృందాలు రంగంలో దిగడం, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు చెరువులను తలపిస్తుండటంపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై గత కాంగ్రెస్ ప్రభుతాన్ని తప్పుపట్టారు. నగరంలో ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ ప్రభుత్వమే కారణమన్నారు.


''కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో అసాధారణ రీతిలో వర్షాలు కురుస్తున్నాయి. గత 90 ఏళ్లలో ఈ తరహా వర్షాలను చూడలేదు. అన్ని ట్యాంకులు నిండిపోయాయి. పొంగి పొర్లుతున్నాయి. నిరంతరాయంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా వర్షాలు పడ్డాయి. కొందరు బెంగళూరు మొత్తం సమస్యలో చిక్కుకుందని అంటున్నారు. అది నిజం కాదు. రెండు జోన్లు సమస్యాత్మకంగా గుర్తించాం. వాటిలో మహదేవపుర ఒకటి. ఇది చాలా చిన్న ప్రాంతం. ఇక్కడ 69 ట్యాంకులు ఉండటమే అసలు సమస్య. అన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఆక్రమణలు కూడా ఉన్నాయి'' అని చెప్పారు. బెంగళూరులో ప్రస్తుత పరిస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ఏ మాత్రం ప్రణాళికలు లేని అప్పటి ప్రభుత్వ యంత్రాగమే ఈ దుస్థితికి కారణమని, వాళ్లు చెరువులను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని, చెరువులు, బఫర్ జోన్లలో కూడా అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేవారని అన్నారు.


సవాలుగా తీసుకున్నాం...

ప్రస్తుత పరిస్థితిని తమ ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుందని, ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లు, వర్కర్లు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రేయింబవళ్లూ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చెప్పారు. తాము అనేక ఆక్రమణలకు విముక్తి కల్పించామని, ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉన్నామని చెప్పారు. ట్యాంకులకు స్లూయిజ్ గేట్లు పెట్టడం వల్ల వంటి చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. వాటర్ డ్రైనింగ్‌ కోసం రూ.1,500 వెచ్చించామని, ఆక్రమణల తొలగింపులకు మరో రూ.300 కోట్లు ఇచ్చామని చెప్పారు. భవిష్యత్తులో వరద నీటి ముప్పు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంచినీటి సరఫరాలో తలెత్తిన అవాంతరాలపై అడిగిన ప్రశ్నకు మాండ్య జిల్లాలోని రెండు వాటర్ పంపింగ్ స్టేషన్లలో వరద నీటి ప్రభావం ఉందని చెప్పారు. మరో పంప్‌ హౌస్‌కు ఈరోజే క్లియరెన్స్ ఇచ్చామని చెప్పారు. ట్యాంకర్లు, బోర్‌వెల్స్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-09-07T00:44:01+05:30 IST