మహారాష్ట్రతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం’

ABN , First Publish Date - 2022-08-14T08:51:54+05:30 IST

మహారాష్ట్రతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు.

మహారాష్ట్రతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం’

కర్ణాటక సీఎం బొమ్మై

బెంగళూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. పూణెలో శనివారం బంటర కన్నడ సంఘం ఏర్పాటు చేసిన కన్నడ భవన నాలుగో వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్రలో స్థిరపడిన కన్నడిగులు, రాష్ట్ర ప్రగతికి ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు. కొన్ని వివాదాలు ఉన్నా మహారాష్ట్రతో కర్ణాటకకు దశాబ్దాలుగా మంచి సంబంధాలే ఉన్నాయని అన్నారు. మనసులు ఒక్కటైతే సామరస్యం మరింత అల్లుకుంటుందని అన్నారు. శివాజీ మహరాజ్‌ను కన్నడిగులు ఎంతగానో గౌరవిస్తారని అన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవాలను అత్యంత వైభవంగా దేశం మొత్తం ఆచరిస్తున్న వేళ, కర్ణాటకలో 1.25 కోట్ల పతాకాలను ఇంటింటా ఆవిష్కరించామని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా ఆవిర్భవించడం తథ్యమని అన్నారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి స్థానిక బ్రాహ్మణ మహా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాలు పంచుకుని, శనివారం రాత్రి బెంగళూరు నగరానికి తిరిగి వచ్చారు.

Updated Date - 2022-08-14T08:51:54+05:30 IST