‘కార్తీక’ సందడి
ABN , First Publish Date - 2020-12-01T04:21:46+05:30 IST
మండలంలోని గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు ఆలయాలు, గోదావరి తీర ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది.
భక్తజనసంద్రంగా గూడెం ఆలయం
పుణ్యస్నానాలతో కిటకిటలాడిన గోదావరి తీరం
స్వామి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు
సత్యనారాయణ వ్రతాలు, దీపారాధన పూజలు
ఇళ్ళలో తులసీ పూజలు
దండేపల్లి, నవంబరు 30 : మండలంలోని గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు ఆలయాలు, గోదావరి తీర ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది. గూడెం సత్యనారాయణస్వామి దేవస్థానంలో సోమవారం కార్తీక పౌర్ణమి మహాజాతర వేలాది మంది భక్తజనం మధ్య కన్నుల పండువగా పౌర్ణమి జాతర జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి సత్యదేవున్ని దర్శంచుకున్నారు. గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించి, నదిలో కార్తీక దీపారాధన చేశారు. అనంతరం సత్యనారాయణ స్వామి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను భక్తులు దర్శించుకున్నారు. గూడెం గుట్ట కింద నుంచి ఘాట్రోడ్డు ద్వారా పైకి వెళ్ళ డానికి భక్తుల కోసం సౌకర్యాలు కల్పించి, షామియానాలు, తాగునీరు ఏర్పా టుచేశారు. దేవాలయ ధర్మదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్, ఈవో వడ్లూరి అనూష ఆలయ సిబ్బంది జాతర ఉత్సవాలను పర్యవేక్షించారు. కార్తీక పౌర్ణమి జాతర సందర్బంగా వేద పండితులు, ఆలయ అర్చకులు స్వామి వారికి నిత్య అభిషేకాలు, కుంకుమార్చన, హోమ యజ్ఞాలు నిర్వహించారు. ప్రధాన ఆలయం, ఆలయ ప్రాంగణంలో గల రావి చెట్టు వద్ద భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో సుమారు వెయ్యి మందికి పైగా దంపతులు వ్రతాలు ఆచరించారు. కార్తీక మాసంలో స్వామి వత్రం నిర్వహిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దేవస్థానం ప్రధాన ఆలయం, కింద ఉన్న రెండు వ్రత మండపాలు కాకుండా అదనంగా మరో మండపం ఏర్పాటుచేశారు.
ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీసీపీ ఉదయ్కమార్రెడ్డి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట సీఐ నారాయణనాయక్, దండేపల్లి ఎస్సై శ్రీకాంత్, ఆధ్వర్యంలో 10 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 200 మందికి పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసు అధికారులు పర్యవేక్షించారు. గోదావరితీరం వద్ద గజ ఈతగాళ్ళను ఏర్పాటుచేశారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో గురుస్వామి చక్రవర్తులు పురుషోత్తమచార్యులచే సుమారు 400 మంది మాలధారణ స్వీకరించారు. దీంతో శరణగోషతో ఆలయప్రాంగణమంతా మార్మోగింది.
కొక్కిరాల రఘపతిరావు ట్రస్ట్ ద్వారా మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొకిరాల ప్రేంసాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో భక్తులకు మినరల్ వాటర్ పంపిణీ చేశారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి ఆల యంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనా రాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు.
ద్వారక గోదావరి ఒడ్డున గల దత్తాత్రేయ ఆలయంలో డీఈవో వి.వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో పూజలు చేశారు. న్యాయవాది గంట నారాయణ, విశ్రాంతి ఉపాధ్యాయుడు కర్నాల రాజమౌళి ఉన్నారు.