Compassion pen: అద్దాల వంతెనతో ‘కరుణ కలం’

ABN , First Publish Date - 2022-08-03T14:21:00+05:30 IST

స్థానిక మెరీనా(Marina)తీరంలోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) సమాధి వద్ద రూ. 80 కోట్లతో నిర్మించనున్న ‘కరుణ కలం’ స్తూపం వ

Compassion pen: అద్దాల వంతెనతో ‘కరుణ కలం’

                               - వలయాకారంలో చిన్న ఉద్యానవనం


చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెరీనా(Marina)తీరంలోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) సమాధి వద్ద రూ. 80 కోట్లతో నిర్మించనున్న ‘కరుణ కలం’ స్తూపం వద్ద అద్దాల వంతెన నిర్మించేందుకు ప్రజాపనుల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కరుణానిధి రాజకీయవేత్తగానే కాకుండా సాహితీవేత్తగా, సినీ రచయితగా ఖ్యాతినార్జించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని డీఎంకే ప్రభుత్వం ఆయన సమాధి ప్రాంతంలో పెన్ను రూపంలో స్తూపాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల ఆ నిర్మాణ పథకంలో మార్పు చేస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు కరుణానిధి సమాధి వద్ద కాకుండా సముద్రతీరంలో 134 అడుగుల ఎత్తుతో ‘కరుణ కలం’ స్తూపాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకంలోనూ కొత్త మార్పులు జరుగుతున్నాయి.


కూవం ముఖద్వారం వద్ద...

ప్రస్తుతం సవరించిన ప్రణాళిక ప్రకారం ‘కరుణ కలం’ స్తూపాన్ని నేపియర్‌ వంతెన వద్ద కూవం నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. అది ఇసుక ప్రాంతంగా ఉండటంతో పునాదులు పటిష్ఠంగా వేయడానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. తీరం నుంచి 360 మీటర్ల దూరంలో, కరుణ సమాధి నుంచి 650 మీటర్ల దూరంలో కన్నియాకుమారి(Kanniyakumari)లోని తిరువళ్లువర్‌ విగ్రహ ప్రాంతాన్ని తలపించే రీతిలో ‘కలం’ స్థూపాన్ని నిర్మిస్తారు. అదే సమయంలో కరుణానిధి సమాధి నుంచి ఆ స్తూపం ఏర్పాటుకానున్న ప్రాంతం వరకు అద్దాల వంతెన కూడా నిర్మించనున్నారు. ఈ వంతెన సముద్రమట్టం నుంచి ఆరు మీటర్ల ఎత్తు, ఏడు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక ‘కలం’ స్తూపం చుట్టూ వలయాకారంలో చిన్న ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సందర్శకులు అద్దాల వంతెనపై నడిచి వెళ్ళి ఆ స్తూపాన్ని అతి సమీపం నుంచి చూడగలరు. అద్దాల వంతెన దిగువ సముద్రపు అలల శబ్దాలు కూడా వినిపించేలా దాని నిర్మాణం జరుగనుంది. 

Updated Date - 2022-08-03T14:21:00+05:30 IST