కాటమనేని అవుట్!
ABN , First Publish Date - 2022-06-29T08:32:07+05:30 IST
కాటమనేని అవుట్!
రవాణా నుంచి కెనాల్ క్లీనింగ్ మిషన్కు బదిలీ
నెల్లూరు జేసీగా కూర్మనాథ్ నియామకం
ఆరోగ్యశ్రీ అదనపు సీఈవోగా హరీంద్రప్రసాద్
ఎస్వీబీసీ చానెల్ సీఈవోగా షణ్ముఖకుమార్
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రవాణాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో 2013 బ్యాంచ్కు చెందిన పి. రాజబాబును నియమించింది. కాటమనేని భాస్కర్ను కృష్ణా, గోదావరి కెనాల్ క్లీనింగ్ మిషన్ డైరెక్టర్గా బదిలీ చేసింది. ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా కాటమనేని నిలిచారు. ఆరోగ్యశాఖలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల రవాణాశాఖకు బదిలీ అయ్యారు. ఇక్కడ కూడా అనేక అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నార నే విమర్శలు వచ్చాయి. ఎప్పుడో కాలం చెల్లిన వాహనాలకు కూడా ఆయన హయాంలో పన్నులు విధించడంపై సీఎంవో అధికారులు సై తం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతోపాటు 2014 కంటే ముందు వాహనాలకు కూడా హెచ్ఎ్సఆర్పీ(హై సెక్యూరిటీ రిజిస్ర్టేషన్ ప్లేట్స్) అమలు చేయాలని సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీని పై ట్రాన్స్పోర్టు సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రవాణాశాఖలో బదిలీల విషయంలో సొంత నిబంధనలు అమలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆ శాఖ మంత్రికి, కాటమనేనికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయి. అన్నింటి కంటే ముఖ్యంగా కాటమనేని ఏ శాఖకు బదిలీ అయినా, తనకు అనుకూలంగా ఉండే ఒక ఉద్యోగిని ఆ శాఖకు తనతోపాటు తీసుకువస్తుంటారు. ఆరోగ్యశాఖలో అడ్డగోలు వ్యవహారాలు చేసిన ఆ ఉద్యోగిని, తనతోపాటు రవాణాశాఖకూ తీసుకొచ్చి కూర్చొబెట్టారు. ఆయన ద్వారానే రవాణాశాఖలోనూ వ్యవహారాలు నడిపించాలని ప్రయత్నించారు. ఈ 4 అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’కథనాలు ప్రచురించింది. ఈ విషయాలన్నీ సీఎంవో వరకూ వెళ్లడంతో కాటమనేనిపైనే బదిలీ వేటు పండింది. కాగా, నెల్లూరు జేసీ ఎంఎన్.హరీంద్రప్రసాద్ను ఆరోగ్యశ్రీకి అదనపుసీఈవో గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏ పీవోగా ఉన్న 2016 బ్యాచ్కు చెందిన రొణంకి కూర్మనాథ్ను నియమించింది. పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా ఉన్న ఒ.ఆనంద్కు ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు డీఎ్ఫవోగా ఉన్న వైవీకే షణ్ముఖకుమార్ను ఎస్వీబీసీ చానెల్ సీఈవోగా నియమించింది. గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా జి.సురేశ్కుమార్ను నియమించింది. ఏపీసీఎ్ఫఎ్సఎస్ డిప్యూటీ సీఈవోగా బి.సునీల్కుమార్కు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన ఉన్నతవిద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.