అక్కడ పానీపూరీపై నిషేధం... కారణం తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-06-27T17:07:34+05:30 IST

ఖాట్మండు వ్యాలీలోని లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ...

అక్కడ పానీపూరీపై నిషేధం... కారణం తెలిస్తే షాకవుతారు!

ఖాట్మండు వ్యాలీలోని లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ (ఎల్‌ఎంసి) అధికారులు స్థానికంగా కలరా కేసులు పెరగడంతో పానీపూరీ అమ్మకాలను నిషేధించారు. ఇక్కడ ఇప్పటి వరకు 12 కలరా కేసులు నమోదయ్యాయి. నగరంలో పానీపూరీ విక్రయాలు, పంపిణీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు నగర పాలక సంస్థ పేర్కొంది. నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, కారిడార్ ప్రాంతాల్లో పానీపూరీ విక్రయాలను నిలిపివేయించేందుకు సన్నాహాలు చేశామని, లోయలో కలరా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నగర పోలీసు చీఫ్ సీతారాం హచేతు తెలిపారు.


ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఖాట్మండు లోయలో మరో ఏడుగురికి కలరా సోకడంతో, మొత్తం కలరా రోగుల సంఖ్య ఇప్పటివరకు 12కి చేరుకుంది. ఎపిడెమియాలజీ అండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ చుమన్‌లాల్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఖాట్మండు మహానగరంలో ఐదు కలరా కేసులు, చంద్రగిరి మునిసిపాలిటీ, బుధానీలకంఠ మునిసిపాలిటీలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఎవరికైనా కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ముఖ్యంగా వర్షాకాలంలో అతిసారం, కలరా, నీటి ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వశాఖ కోరింది.



Updated Date - 2022-06-27T17:07:34+05:30 IST