కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చు: అమిత్షా
ABN , First Publish Date - 2021-12-22T22:04:55+05:30 IST
కేంద్రమంత్రి అమిత్షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశలో తెలంగాణ ఎన్నికలపై అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికలపై అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని అమిత్షా తెలిపారు. ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే కేసీఆర్, కేంద్రంతో యుద్ధాని రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసససభ్యుల టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్ సరికొత్తగా ముందుకువెళ్లనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్ఎస్పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్కు ఈసారి నో ఛాన్స్ చేప్పే అవకాశముందనే టాక్ వస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు లీకులొస్తున్నాయి. టికెట్దక్కని సిట్టింగ్స్లో తమ పేరు ఉంటుందేమో అనే ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకీ ఎక్కువవుతున్నట్లు నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమలం నేతలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు పొతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్షాతో రాష్ట్ర నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.