పేదరికంతో వైద్యానికి దూరం కాకూడదు: కేసీఆర్

ABN , First Publish Date - 2022-04-26T21:36:11+05:30 IST

పేదరికం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

పేదరికంతో వైద్యానికి దూరం కాకూడదు: కేసీఆర్

హైదరాబాద్: పేదరికం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం  సీఎం కేసీఆర్ అల్వాల్ టీమ్స్ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్‌లో కొత్తగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రుల్లో ఎయిమ్స్ తరహా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ నలుమూలలా వైద్య సేవలు ఉచితంగా అందుతాయన్నారు.అల్వాల్‌లోనే మహిళల ప్రసూతి వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు నిర్వహిస్తున్నాయని చెప్పారు.మనం వైద్యానికి సంబంధించిన సభ జరుపుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పడకలు, సదుపాయాలు పెంచినట్లు తెలిపారు.వైద్యవిధానాన్ని పటిష్టం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు. 


కులమతాల పేరుతో చిల్లర రాజకీయాలు 

కులమతాల పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వీరితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే దేశం మనదన్నారు. శాంతి ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్ ఉంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? అని ప్రశ్నించారు. దేశంలో కరెంట్ ఉంటే వార్తా.. తెలంగాణలో కరెంట్ పోతే వార్తా అన్నారు.గుజరాత్‌లో కూడా కరెంట్ కోసం ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.తెలంగాణలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో గురుకుల పాఠశాలలను పెంచుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-26T21:36:11+05:30 IST