సీఎంకు కరోనా అంటూ వార్త.. పత్రికపై కేసు
ABN , First Publish Date - 2020-07-07T07:37:47+05:30 IST
సీఎంకు కరోనా అంటూ వార్త.. పత్రికపై కేసు
బంజారాహిల్స్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్కు కరోనా వచ్చిందంటూ తప్పుడు వార్తను ప్రచురించారంటూ ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాద్కు చెందిన ఓ పత్రిక యాజమాన్యం, విలేకరిపై కేసు నమోదు చేశారు. ‘‘సీఎం కేసీఆర్కు కరోనా... హరితహారంతోనే’’ అన్న శీర్షికతో ఆ పత్రికలో ఓ కథనం వచ్చింది. సీఎం దగ్గు, జలుబుతో బాధపడుతూ క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడని, ప్రగతిభవన్లో 30 మందికి కరోనా వచ్చినట్టు ప్రచురితమైంది. ఈ కథనాన్ని సోషల్ మీడియాలో చూసిన రహ్మత్నగర్కు చెందిన ఇలియాస్ అనే కార్యకర్త.. సీఎం ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. దీంతో.. ఆ కథనాన్ని రాసిన చిన్ని వెంకటేశ్వరరావు అనే విలేకరితోపాటు.. పత్రిక యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావు ఖమ్మంలో ఉండటంతో.. పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.